ఒట్టావా: భారత సంతతికి చెందిన ట్రక్కు డ్రైవర్ జస్కిరాట్ సింగ్ సిద్దూ దాఖలు చేసుకున్న డిపోర్టేషన్(Deportation) అభ్యర్థనను కెనడా తోసిపుచ్చింది. భారత్కు డిపోర్ట్ చేయవద్దు అని సిద్దూ పెట్టుకున్న అభ్యర్థనను జడ్జి కొట్టిపారేశారు. 2018, ఏప్రిల్ 6వ తేదీన సాస్కచ్వియన్ హైవేపై జరిగిన ప్రమాదంలో సుమారు 16 మంది మరణించారు. ఆ ఘటనలో మరో 13 మంది గాయపడ్డారు. ట్రక్కును నడిపిస్తున్న సిద్దూ ఓ సిగ్నల్ వద్ద దూసుకెళ్లాడు.
జూనియర్ హాకీ ప్లేయర్లను తీసుకెళ్తున్న బస్సును అతను ఢీకొట్టాడు. ఆ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ సిద్దూకు 8 ఏళ్ల జైలుశిక్ష ఖరారు చేశారు. నిజానికి ఈ కేసులో సిద్దూకు పెరోల్ ఇచ్చారు. అయితే కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ మాత్రం అతన్ని డిపోర్ట్ చేయాలని ప్రతిపాదించింది. ఈ కేసును మరోసారి పరిశీలించాలని సిద్దూ లాయర్ బోర్డర్ ఏజెన్సీని కోరారు.
చీఫ్ జస్టిస్ పౌల్ క్రాంప్టన్ తన తీర్పునిస్తూ.. సిద్దూను డిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. మానవతా కోణంలో అతను మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చు అని చీఫ్ జస్టిస్ తెలిపారు. ట్రక్కు ప్రమాదంలో చనిపోయిన హాకీ ప్లేయర్ల కుటుంబీకులు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు సిద్దూ డిపోర్టేషన్ కోరగా, కొందరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు.