భువనేశ్వర్: తొలి కోవిడ్ టీకా డోసు తీసుకున్న నాలుగు నెలల తర్వాత ఆ వ్యక్తిలో యాంటీబాడీలు గణనీయంగా తగ్గుతున్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇండియాలో నిర్వహించిన స్టడీకి సంబంధించిన డేటాను రిలీజ్ చేశారు. రెండు డోసుల టీకాలు తీసుకున్న మొత్తం 614 హెల్త్ వర్కర్లపై జరిపిన సర్వే ఆధారంగా ఈ విషయాన్ని తెలిపారు. యాంటీబాడీలు తగ్గుతున్నంత మాత్రాన.. సదరు వ్యక్తిలో వ్యాధి నిరోధక సామర్థ్యం నిర్వీర్యం అవుతుందని చెప్పలేమన్నారు. ఒడిశాలోని భువనేశ్వర్లో ఉన్న రీజినల్ మెడికల్ రీసర్చ్ సెంటర్ దీనిపై స్టడీ చేసింది. ఆరు నెలల తర్వాత మాత్రమే బూస్టర్ డోసు ఎప్పుడు అవసరం వస్తుందో చెప్పగలమని ఆర్ఎంఆర్సీ డాక్టర్ సంగమిత్ర పతి తెలిపారు. ఇండియాలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న వేర్వేరు స్టడీలను క్రోడీకరించాలన్నారు.
టీకాలు తీసుకున్న ఆరు నెలల్లోనే యాంటీబాడీలు క్రమంగా తగ్గుతుంటాయని ఇటీవల బ్రిటీష్ పరిశోధకులు చెప్పిన విషయం తెలిసిందే. ఫైజర్, ఆస్ట్రాజెనికా టీకాలు తీసుకున్నవారిలో ఈ మార్పు కనిపించినట్లు తెలిపారు. ఇండియన్ స్టడీకి సంబంధించిన నివేదికను రీసర్చ్ స్క్వేర్లో పబ్లిష్ చేశారు. కోవీషీల్డ్, కోవాగ్జిన్ తీసుకున్నవారిలో ఈ స్టడీ చేశారు. బూస్టర్ డోసుల గురించి అధ్యయనం చేస్తున్నా.. దేశంలోని యువతకు ముందుగా వ్యాక్సిన్ ఇవ్వాలని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. దాదాపు 60 శాతం మందికి కనీసం ఒక డోసు టీకా అందినట్లు అధికారులు తెలిపారు.