భారత నైటింగేల్గా పేరు తెచ్చుకున్న స్వాతంత్య్ర సమరయోధురాలు సరోజినీ నాయుడు 1949 లో సరిగ్గా ఇదే రోజున తుదిశ్వాస విడిచారు. భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో, స్వతంత్ర భారత చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు. హైదరాబాద్లోని నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న చారిత్రాత్మక బంగళాలో సరోజినీ నాయుడు తన తల్లిదండ్రులతో నివాసముండేది. ఆమె జ్ఞాపకార్ధం ఈ బంగళాకు ఆమె ప్రసిద్ధ కవితా సంకలనం ‘గోల్డెన్ థ్రోషోల్డ్’ పేరు పెట్టారు. గాంధీజీచేత భారత కోకిలగా పిలిపించుకున్న సరోజినీ నాయుడు.. మహిళా చైతన్యానికి, స్వతంత్ర వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలిచారు.
కోల్కతాకు చెందిన అఘోరనాథ్ చటోపాధ్యాయ, వరద సుందరి దేవి దంపతులకు 1879 ఫిబ్రవరి 13 న హైదరాబాద్ నగరంలో సరోజినీ జన్మించారు. తండ్రి నిజాం కళాశాల తొలి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు. తల్లి వరదా సుందరి దేవి రచయిత్రి. తల్లిదండ్రులు విద్యాధికులు కావడంతో సరోజినిపై వారి ప్రభావం ఎక్కువగా ఉండేది. ఇంగ్లిష్పై ఉన్న అభిమానంతో ఆబిడ్స్లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో చేరింది. 12 వ ఏటనే మద్రాస్ విశ్వవిద్యాలయంలో చేరి మెట్రిక్యులేషన్ పూర్తిచేసింది. అనంతరం లండన్ కింగ్స్ కాలేజీలో, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. తల్లి నుంచి కవయిత్రి లక్షణాలను ఒంటపట్టించుకున్న సరోజినీ.. బర్డ్ ఆఫ్ టైమ్, ది గోల్డెన్ థ్రెషోల్డ్, ది బ్రోకెన్ వింగ్స్ వంటి ఎన్నో ప్రసిద్ధ రచనలు చేశారు. ఈమె రచనలను ఇంగ్లండ్లోని ఆంగ్ల భాషా విమర్శకులు కూడా మెచ్చుకునేవారు.
1914లో మహాత్మా గాంధీని కలిసినప్పటి నుంచి దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నది. గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ఆయనతో కలిసి పనిచేశారు. 1925 లో కాంగ్రెస్కు తొలి భారతీయ మహిళా అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. మన దేశంలో ప్లేగు మహమ్మారి వ్యాప్తి సమయంలో ఆమె సేవలకు గుర్తింపుగా 1928లో ‘కేసర్-ఏ-హింద్’ అవార్డును అందుకున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత యునైటెడ్ ప్రావిన్సెస్ (ప్రస్తుతం ఉత్తరప్రదేశ్) గవర్నర్గా నియమితులై మొదటి మహిళా గవర్నర్గా చరిత్రలో నిలిచారు. చనిపోయేంత వరకు ఆమె ఈ పదవిలో కొనసాగారు. 70 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో 1949 మార్చి 2న లక్నోలో కన్నుమూశారు. సరోజినీ నాయుడు 135వ జయంతి సందర్భంగా 2014 ఫిబ్రవరి 13 న భారతదేశంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించారు.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..