న్యూఢిల్లీ: కేవలం 73 గంటల్లోనే మొత్తం ఏడు ఖండాల్లో విమానంలో ప్రయాణించి ఇద్దరు భారతీయులు గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. సుజోయ్కుమార్ మిశ్రా, డాక్టర్ అలీ ఇరానీ అత్యంత వేగంగా మూడు రోజుల ఒక గంట ఐదు నిమిషాల నాలుగు సెకండ్లలో ఏడు ఖండాలను చుట్టేసినట్టు గిన్నిస్ రికార్డు తన వెబ్సైట్లో పేర్కొన్నది. వీరిద్దరు డిసెంబర్ 4న అంటార్కిటికాలో బయలుదేరి 7న ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో తమ ప్రయాణాన్ని ముగించారు. యూఏఈకి చెందిన ఖవ్లా అల్ రొమైతి సృష్టించిన మూడు రోజుల 14 గంటల 46 నిమిషాల 48 సెకండ్ల రికార్డును వీరిద్దరు చెరిపేశారు. మిశ్రా, డాక్టర్ ఇరానీ ఔత్సాహిక ప్రయాణికులు. 64 ఏండ్ల ఇరానీ భారత క్రికెట్ జట్టుకు ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్నారు. వీరు 4 రోజుల్లో ఏడు ఖండాలు ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఆస్ట్రేలియాలో ప్రయాణించారు.