దోహ: ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించేసిన తాలిబన్లతో ఇవాళ భారత్ చర్చలు జరిపింది. దోహలో తాలిబన్ల నేతతో భారత రాయబారి మాట్లాడారు. ఉగ్రవాదంపై ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. ఆఫ్ఘన్ భూభాగంలో ఉగ్రవాదుల కదలికలు ఆందోళనలు కలిగిస్తున్నట్లు భారత రాయబారి వెల్లడించారు. ఖతార్ రాయబారి దీపక్ మిట్టల్.. తాలిబన్ల పొలిటికల్ ఆఫీసు అధిపతి షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్తో ఇవాళ సంప్రదింపులు జరిపారు. దోహలో ఉన్న ఇండియన్ ఎంబసీలో ఈ మీటింగ్ జరిగింది. తాలిబన్ల అభ్యర్థన మేరకు ఈ భేటీ జరిగినట్లు ఓ ప్రకటన ద్వారా వెల్లడైంది.
ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకున్న భారతీయుల రక్షణ, భద్రత అంశం గురించి తాలిబన్ నేతతో దీపక్ చర్చించారు. భారతీయులను సురక్షితంగా తరలించేందుకు చేపట్టాల్సిన చర్యలు గురించి మాట్లాడారు. భారత్కు రావాలనుకుంటున్న ఆఫ్ఘన్ మైనార్టీల అంశం గురించి కూడా వారిద్దరూ చర్చించారు. ఆఫ్ఘన్ భూభాగాన్ని భారత వ్యతిరేక చర్యలకు, ఉగ్రవాద కార్యకలాపాలకు వాడకూడదని దీపక్ మిట్టల్ తాలిబన్లను కోరారు. ఈ సమస్యలన్నింటికీ సానుకూలంగా స్పందించనున్నట్లు తాలిబన్ ప్రతినిధి తెలిపారు.
మరో వైపు ఆఫ్ఘన్ సమస్య గురించి చర్చించేందుకు అత్యున్నత బృందాన్ని ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.