Indian Died : హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) సమీపంలో నిలిచిన భారత వాణిజ్య నౌక (India Ship) లో కెప్టెన్గా విధి నిర్వహణలో ఉన్న ఒక భారతీయుడు (Indian) మృతిచెందాడు. చమురుతో భారత్కు వస్తున్న వాణిజ్య నౌకకు అతను కెప్టెన్గా ఉన్నాడు. ఆ నౌకా కెప్టెన్కు గుండెపోటు రావడంతో మరణించినట్లు అతడి కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు సాయం చేయాలని కుటుంబసభ్యులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
జార్ఖండ్ రాజధాని రాంచీకి చెందిన రాకేశ్ రంజన్ (43) ‘అవానా’ చమురు నౌకకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. ఆ నౌక భారత్కు బయలుదేరింది. అయితే యుద్ధం నేపథ్యంలో ఇది హర్మూజ్కు 14 నాటికల్ మైళ్ల దూరంలో చిక్కుకుపోయింది. ఈ క్రమంలో ఈనెల 18న రంజన్ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. వైద్య సాయం అందించినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఉద్రిక్తతల నేపథ్యంలో అతడిని విమానంలో తరలించేందుకు అనుమతులు లభించలేదు. ఈ క్రమంలో పడవలో దుబాయ్లోని పోర్ట్ రషీద్కు తరలించారు. అక్కడ రంజన్ ప్రాణాలు కోల్పోయాడు. గుండెపోటు కారణంగా రంజన్ మృతిచెందినట్లు చెప్పారు.
అయితే పోస్టుమార్టం తర్వాతే నైకా కెప్టెన్ మృతికిగల కచ్చితమైన కారణాలు తెలియనున్నాయి. ఇక, రంజన్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం అందించాలని కుటుంబసభ్యులు విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, రాంచీ ఎంపీ సంజయ్ సేథ్లకు లేఖలు రాసినట్లు మృతుడి సోదరుడు వెల్లడించారు. రంజన్కు భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం.