ముంబై: బీజేపీకి ప్రధాని పదవిని వదిలిపెట్టింది తామేనని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఉత్తర భారతదేశంలో తాము పోటీ చేయకుండా బీజేపీకి వదిలేశామని, లేనట్లయితే దేశం తమ పార్టీ నుంచి ప్రధానిని చూసేదని చెప్పారు. మహారాష్ట్రలో ఎక్కడో అడుగున ఉన్న బీజేపీని ఉన్నత స్థాయికి తీసుకువచ్చిన ఘనత శివసేనదేనని చెప్పారు.
‘మహారాష్ట్రలో బీజేపీని అట్టడుగుస్థానం నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాం. బాబ్రీ ఉదంతం తర్వాత ఉత్తర భారతదేశంలో శివసేన పవనాలు బలంగా వీచాయి. అలాంటి దశలో మేము ఎన్నికలకు వెళ్లి ఉంటే మా (శివసేన) ప్రధానే దేశాన్ని ఏలి ఉండేవారు. అయితే, ఆ అవకాశాన్ని మేము బీజేపికిచ్చాం. అధికారం కోసమే హిందుత్వను బీజేపీ వాడుకుంటున్నదని’ సంజయ్ రౌత్ విమర్శించారు.
బీజేపీ కూటమిలో శివసేన 25 ఏళ్ల కాలాన్ని వృథా చేసిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే అన్నారు. హిందుత్వానికి అధికారం అందించేందుకు బీజేపీతో శివసేన జతకట్టిందని, అధికారం కోసం ఎప్పుడూ హిందుత్వాన్ని వాడుకోలేదని చెప్పారు.