Sri Lanka | తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక ప్రజలకు అండగా నిలుస్తామని భారత్ ప్రకటించింది. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల కోసం, ప్రగతి కోసం పోరాడుతున్న శ్రీలంక ప్రజలకు అండగా నిలుస్తామని విదేశాంగశాఖ ఓ ప్రకటన చేసింది. ఆర్థిక సంక్షోభంతో మిన్నంటిన శ్రీలంక ప్రజల ఆగ్రహ జ్వాలల తీవ్రతను ముందే గుర్తించిన అధ్యక్షుడు గోటబయా రాజపక్స పారిపోయారు. తన పదవికి రాజీనామా చేస్తానని ప్రధాని రణిల్ విక్రమ సింఘే శనివారం ప్రకటించారు. అధ్యక్ష పదవికి గోటబయా రాజీనామా చేస్తారని స్పీకర్ వెల్లడించారు. ఈ పరిణామాలన్నింటిని గమనించిన భారత్.. శ్రీలంక వాసులకు అండగా ఉంటామని అభయమిచ్చింది.
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ప్రారంభమైనప్పటినుంచి తాము మద్దతుగా నిలిచామని భారత్ గుర్తు చేసింది. ఇప్పటికే 380 కోట్ల డాలర్ల సాయం అందించామని, ఇక ముందు కూడా ఈ సాయం అందిస్తామని తెలిపింది. `శ్రీలంక ప్రజలు ఎదుర్కొంటున్న పలు సవాళ్ల గురించి మాకు తెలుసు. ఈ క్లిష్ట కాలంలో కష్టాలను అధిగమిచేందుకు శ్రీలంక వాసులకు అండగా నిలుస్తాం` అని వ్యాఖ్యానించింది. శ్రీలంక తమ పొరుగుదేశం, సన్నిహిత దేశం అని పేర్కొంది. రెండు దేశాలు తమ మధ్య నాగరికత సంబంధాలను పరస్పరం పంచుకున్నాయని వివరించింది.