శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని రాజౌరీ జిల్లా డాంగ్రీలో ఆదివారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఉదయం ఉగ్రవాదులు పెట్టిన మందుపాతర పేలి ఒక చిన్నారి మరణించింది. ఈ ఘటనలపై పీడీపీ అధ్యక్షురాలు, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇవి గుండెలను పిండేసే ఘటనలని వ్యాఖ్యానించారు.
మృతుల కుటుంబసభ్యులకు తీరని నష్టం జరిగిందని ముఫ్తీ పేర్కొన్నారు. భగవంతుడు వారికి ధైర్యాన్ని ఇవ్వాలన్నారు. హిందూ, ముస్లింల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవడం ఒక వర్గానికి అలవాటుగా మారిందని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ వర్గం దేశంలో విద్వేషాలను పెంచి పోషిస్తున్నదని మండిపడ్డారు. కశ్మీర్ సహా భారత్ పూర్తిగా లౌకిక దేశమేనని, అయితే ఇప్పుడు కొందరి వల్ల భారత్ గాడ్సే దేశంలా మారుతున్నదని మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు.