న్యూఢిల్లీ: భారత్లో కోవీషీల్డ్ టీకా వేసుకున్న వారి 26 మందికి బ్లీడింగ్, బ్లడ్ క్లాటింగ్ జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం ఇవాళ వెల్లడించింది. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనికా తయారు చేసిన టీకాలను.. ఇండియాలో సీరం సంస్థ కోవీషీల్డ్ పేరుతో పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రాజెనికా టీకాల వల్ల .. కొందరిలో రక్తం గడ్డకట్టినట్లు ఇటీవల కొన్ని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. యూరోప్లో ఇలాగే 20 వరకు కేసులు నమోదు అయినట్లు రికార్డులు ఉన్నాయి. భారత్లో నమోదు అయిన బ్లీడింగ్, క్లాటింగ్కు సంబంధించిన నివేదికను నేషనల్ ఏఈఎఫ్ఐ కమిటీ ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖకు అందజేసింది.
ఏప్రిల్ 3వ తేదీ వరకు ఇండియాలో 75,435,381 మంది వ్యాక్సిన్లు ఇచ్చారని, దాంట్లో కోవీషీల్డ్ 68చ650,819 మందికి, కోవాగ్జిన్ టీకాలను 6,784,819 మందికి ఇచ్చినట్లు నేషనల్ ఏఈఎఫ్ఐ తెలిపింది. భారత్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టి తర్వాత 23 వేల సమస్యాత్మక కేసులను గుర్తించినట్లు ప్రభుత్వం చెప్పింది. కోవిడ్ పోర్టల్ ద్వారా అది తెలిసినట్లు చెప్పింది. దీంట్లో కేవలం 700 కేసులు మాత్రమే సీరియస్గా ఉన్నట్లు పేర్కొన్నది. అంటే పది లక్షల్లో 9.3 కేసులు సమస్యాత్మకం అని గుర్తించినట్లు కమిటీ చెప్పింది. సుమాఉ 498 సీరియస్ కేసులను ఆ కమిటీ లోతుగా అధ్యయనం చేసింది. దాంట్లో 26 మందికి మాత్రం వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు. కోవీషీల్డ్ తీసుకున్నవారిలో త్రాంబోఎంబోలిక్ కేసులు 0.61గా ఉన్నట్లు కమిటీ స్పష్టం చేసింది. ఇక కోవాగ్జిన్ టీకా తీసుకున్నవారిలో రక్తం గడ్డకట్టిన కేసులేవీ నమోదు కాలేదన్నది.
రక్తం గడ్డకట్టే కేసులు ఇండియాలో అతి స్వల్పంగా నమోదు అయినట్లు ఏఈఎఫ్ఐ వెల్లడించింది. అది కేవలం 0.61గా ఉన్నట్లు చెప్పింది. ఇదే రేటు బ్రిటన్లో 4 శాతంగా ఉన్నది. ఇక జర్మనీలో పది లక్షల మందిలో పది మందికి రక్తం గడ్డకట్టినట్లు కమిటీ తన నివేదికలో చెప్పింది. అయితే యురోపియన్ దేశాల ప్రజలతో పోలిస్తే, దక్షిణాసియా దేశాల్లో ఉన్న ప్రజల్లో 70 శాతం వరకు త్రాంబోఎంబోలిక్ కేసులు నమోదు కావు అని పేర్కొన్నది. ముఖ్యంగా కోవీషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నవారు కనీసం 20 రోజుల పాటు తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ తన అడ్వైజరీలో పేర్కొన్నది. త్రాంబోఎంబోలిక్ లక్షణాలను పసికట్టాలన్నది. ఇండియాలో ఏప్రిల్ 27వ తేదీ నాటికి 13.4 కోట్ల కోవీషీల్డ్ డోసులను ఇచ్చారు. వ్యాక్సిన్ల పనితీరును ప్రతి రోజు ఆరోగ్యశాఖ మానిటర్ చేస్తోందని కేంద్రం పేర్కొన్నది.