India-China | డ్రాగన్ దేశం చైనా కవ్వింపులకు పాల్పడుతూనే ఉన్నది. భారత్ భూభాగాన్ని తన భూభాగమేనని చెప్పుకునేందుకు మరోసారి ప్రయత్నిస్తున్నది. అరుణాచల్ప్రదేశ్ను టిబెట్లోని దక్షిన భాగమని చెబుతున్న చైనా.. దాన్ని జాంగ్నామ్గా పేర్కొంటూ.. అక్కడి 11 ప్రాంతాల పేర్లను సిద్ధమైంది. చైనా కేబినెట్ జారీ చేసిన భౌగోళిక పేర్లపై నిబంధనల మేరకు.. చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వశాఖ చైనీస్, టిబెటన్, పిన్యిన్ అక్షరాలతో ప్రామాణిక పేర్లను విడుదల చేసింది.
ఈ పేర్ల మార్పు జాబితాలో రెండు భూభాగాలు, ఐదు పర్వత ప్రాంతాలు, రెండు నదులతోపాటు సబార్డినేట్ అడ్మినిస్ట్రేటివ్ జిల్లాలు ఉన్నాయి. ఈ విషయాన్ని చైనా అధికారిక పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ తెలిపింది. చైనా పేర్ల అరుణాచల్ప్రదేశ్లోని పలు ప్రదేశాలకు పేర్లు మార్చడం ఇదే తొలిసారేం కాదు. ఇంతకు ముందు 2017లో తొలి విడతలో ఆరు ప్రాంతాలకు కొత్తగా పేర్లను పెట్టింది. టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా అరుణాచల్ప్రదేశ్ను సందర్శించిన కొద్ది రోజుల తర్వాత చైనా ప్రకటన చేసింది. ఆ సమయంలో దలైలామా పర్యటనపై సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు.
2021లో రెండో విడతలో 15 ప్రాంతాలకు కొత్తగా పేర్లు పెట్టింది. తాజాగా మరో 11 పేర్లను మార్చబోతున్నట్లు పేర్కొంది. పేర్ల మార్పుపై భారత్ స్పందించింది. చైనా చర్యలను వ్యతిరేకించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఒక ప్రకటన విడుదల చేశారు. చైనా ప్రకటనను చూశామని, ఈ చర్యలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇంతకు ముందు సైతం పేర్లను మార్చేందుకు ప్రయత్నించిందని ఆయన గుర్తు చేశారు.అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగంగా కొనసాగుతుందన్నారు. కల్పిత పేర్లను ఆపాదించే ప్రయత్నాలు వస్తవాలను మార్చలేవని స్పష్టం చేశారు.