మాండ్య: మాండ్య నియోజకవర్గ స్వతంత్య్ర అభ్యర్థి ఎంపీ సుమలత అంబరీష్(MP Sumalatha Ambareesh).. త్వరలో బీజేపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇవాళ ప్రకటించారు. దీంతో ఆమె రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ, జేడీఎస్ దళానికి సపోర్టు ఇవ్వనున్నట్లు చెప్పేశారు. మాండ్యాను తాను విడిచిపెట్టడం లేదని, రాబోయే రోజుల్లో మీకోసం నేను పనిచేయడం చూస్తారని, బీజేపీలో చేరడానికి డిసైడ్ అయినట్లు సుమలత తెలిపారు. 2019 నాటి ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో కుమారస్వామి కుమారుడు నిఖిల్పై సుమలత విజయం సాధించిన విషయం తెలిసిందే.
సీట్ షేరింగ్ ఫార్ములా ప్రకారం.. కర్నాటకలో బీజేపీ 25 స్థానాల్లో పోటీ చేయనున్నది. జేడీఎస్ మూడు చోట్ల పోటీ చేస్తుంది. ఈసారి మాండ్య నుంచి జేడీఎస్ పోటీలో నిలబడనున్నది. తాను స్వతంత్య్ర ఎంపీగా ఉన్నా.. కేంద్రంలోని బీజేపీ సర్కారు మాండ్య లోక్సభ నియోజకవర్గానికి 4 వేల కోట్ల నిధుల్ని రిలీజ్ చేసినట్లు సుమలత వెల్లడించారు. బీజేపీ నుంచి రాజ్యసభకు సుమలత వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.