Independence Day 2023 | భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ వ్యూహాల్లో సైన్య సహకార ఒప్పందం ఒకటి. దీని కారణంగా భారతీయ రాజ్యాలు తమ సార్వభౌమత్వాన్ని కోల్పోయి, బ్రిటిష్ వారికి దాసోహమైపోయాయి. లార్డ్ వెల్లస్లీ (1798- 1805) రూపొందించిన ఈ పథకం బ్రిటిష్ సామ్రాజ్య నిర్మాణంలో కీలకంగా నిలిచిపోయింది. ఈ ఒప్పందాన్ని అంగీకరించే భారతీయ రాజ్యాలు తమ భూభాగంలో బ్రిటిష్ సైన్యాలు ఉండటానికి అంగీకరించాలి. వారి పోషణ ఖర్చును స్థానిక పాలకులే చెల్లించాలి. అలా చేయలేకపోతే కొంత భూభాగాన్ని కంపెనీకి ఇచ్చేయాలి. ఫలితంగా అంతర్గతంగా, బాహ్యంగా దాడులు జరగకుండా ఒప్పందానికి అంగీకరించిన రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్లు కాపాడతారు. అయితే అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోమని చెప్పినప్పటికీ, ఆచరణలో అది దాదాపుగా శూన్యం. అంతేకాకుండా ఒప్పందంలో భాగమైన రాజ్యం మరే ఇతర విదేశీ శక్తితో ఎలాంటి సంబంధమూ కలిగి ఉండకూడదు.
ఇంగ్లిష్ వాళ్లు కాకుండా ఇతర దేశీయులకు ఉద్యోగాలు ఇవ్వకూడదు. అప్పటికే ఎవరైనా ఉద్యోగంలో ఉంటే ఒప్పందం కాగానే తొలగించాలి. బ్రిటిష్ వారి అనుమతి లేకుండా ఇతర భారతీయ రాజ్యాలతోనూ ఒప్పందాలు చేసుకోకూడదు. అలా సైన్య సహకార ఒప్పందానికి లోబడిన భారతీయ పాలకులు ఒక రకంగా చెప్పాలంటే అన్ని అధికారాలను కోల్పోయారు. కేవలం బ్రిటిష్ వారి గొడుగు నీడకు చేరినట్లయింది. అయితే భారతీయ రాజ్యాలపై ఈ ఒప్పందం ఎన్నో దుష్ప్రభావాలను చూపించింది. భారతీయ సైనికులు ఉద్యోగాలు కోల్పోయారు. రాజ్యాలు స్వతంత్రం కోల్పోయాయి. సైన్య సహకార ఒప్పందాన్ని అంగీకరించిన తొలి భారతీయ పాలకుడు హైదరాబాద్ నిజాం కావడం గమనార్హం. నిజాం రాజు, కంపెనీ మధ్య ఈ ఒప్పందం 1798లో కుదిరింది. మైసూరు, తంజావూరు, అవధ్, పీష్వా, సిందియా, గైక్వాడ్ తదితర పాలకులు కూడా ఈ ఒప్పందానికి లోబడ్డవారే.