ముంబై: నటుడు సోనూసూద్, ఆయన బంధువులు, స్నేహితులకు చెందిన కంపెనీలు, నివాసాల్లో సోదాలను ఐటీ శాఖ మరింత విస్తృతం చేసింది. బుధవారం ముంబై, లక్నోలోని కనీసం ఆరు చోట్ల సోదాలు జరగ్గా, తాజాగా ముంబైలో మరికొన్ని చోట్ల సోదాలు నిర్వహించారు. భూమి కొనుగోలు ఒప్పందం, కొన్ని ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పన్ను ఎగవేత కేసులో సోనూసూద్, సంబంధీకుల నివాసాల్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తున్నది. పెద్ద మొత్తంలో పన్ను ఎగవేతకు పాల్పడినట్టు గుర్తించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఢిల్లీ ప్రభుత్వం విద్యార్థులకు కెరీర్లో గైడెన్స్ కోసం చేపట్టిన ‘దేశ్ కా మెంటార్స్’ కార్యక్రమానికి సోనూసూద్ను ప్రచారకర్తగా నియమించిన తర్వాత ఈ సోదాలు ప్రారంభం కావడం గమనార్హం. సోనూసూద్పై ఐటీ దాడులను శివసేన ఖండించింది. లాక్డౌన్లో విశేష సేవలకు గాను సోనూసూద్ను పొగిడిన బీజేపీ.. ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలు సామాజిక కార్యక్రమాల్లో ఆయనను భాగస్వామి చేయాలని నిర్ణయించగానే ‘పన్ను ఎగవేతదారు’గా ముద్ర వేసిందని ఆరోపించింది.