లక్నో : ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యాపారి ఇంట్లో లెక్క కట్టలేనన్ని నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. నిన్నటి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఆ వ్యాపారి ఇంట్లో సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. చెలిమెలో నీళ్లు ఊరినట్టు.. ఆ ఇంట్లో నోట్ల కట్టలు బయట పడుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు రూ. 150 కోట్ల నగదును ఐటీ అధికారులు లెక్కించారు. ఇంకా కౌంటింగ్ కొనసాగుతూనే ఉందని తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. యూపీకి చెందిన పీయూష్ జైన్ కాన్పూర్లో పర్ఫ్యూమ్ ఇండస్ట్రీ నడుపుతున్నాడు. అయితే అతనిపై పన్ను ఎగవేత ఆరోపణలు ఉన్నాయి. దీంతో గురువారం ఉదయం నుంచి ఐటీ అధికారులు.. వ్యాపారి ఇంటిని తమ ఆధీనంలోకి తీసుకుని సోదాలు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం వరకు రూ. 150 కోట్ల నగదు లెక్కించామని, ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రెండు అల్మారాల్లో నగదు కట్టలు భద్రంగా దాచిపెట్టారు. ఆ అల్మారాలో సుమారు 30 వరకు నోట్ల కట్టలు ఉన్నట్లు అధికారులు తేల్చారు. మూడు కౌంటింగ్ మిషన్లతో నోట్లను లెక్క కడుతున్నారు. కాన్పూర్తో పాటు ముంబై, గుజరాత్లోనూ సోదాలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
వ్యాపారి పీయూష్ జైన్.. సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్కు అత్యంత సన్నిహితుడు. సమాజ్వాదీ పార్టీ పేరు మీద ఓ బ్రాండ్ పర్ఫ్యూమ్ కూడా తయారు చేసి మార్కెట్లోకి తీసుకొచ్చాడు పీయూష్ జైన్. అయితే పీయూష్ జైన్ ఇంట్లో డబ్బులు లెక్కపెడుతున్న దృశ్యాలను బీజేపీ నేత సంబిత పాత్ర ట్వీట్ చేశారు. సమాజ్ వాదీ పార్టీ అవినీతి వాసన అంటూ.. ఆయన చేసిన ట్వీట్.. అందులో ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి.