న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ మెట్రో పింక్లైన్ కారిడార్లో డ్రైవర్లెస్ మెట్రో సర్వీస్ పరుగులు పెట్టింది. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్సింగ్ పూరి, ఢిల్లీ రవాణాశాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ 59 కిలోమీటర్ల పొడవైన పింక్ లైన్ (మజ్లిస్ పార్క్ – శివ్ విహార్)లో డ్రైవర్లెస్ మెట్రో రైలు ఆపరేషన్ (DTO) ప్రారంభించారు. దీంతో ఢిల్లీ మెట్రో పూర్తి ఆటోమేటిక్ నెట్వర్క్ విస్తీర్ణం 97 కిలోమీటర్లకు పెరిగింది.
ఇది ప్రపంచంలో నాల్గో అతిపెద్ద, భారత్లో ఏకైక డ్రైవర్లెస్ మెట్రో ఆపరేషన్ నెట్వర్క్ కాగా.. ఈ సదుపాయం ఉన్న ప్రపంచంలోని పలు దేశాల సరసన భారత్ నిలిచింది. ఇంతకు ముందు మెజెంటా లైన్లో డీఓటీ సదుపాయాన్ని గతేడాది ప్రవేశపెట్టారు. పింక్లైన్ మొత్తం 58.43 కిలోమీటర్లు కాగా.. 38 స్టేషన్లు ఉన్నాయి. ఇందులో 26 ఎలివేటెడ్, 12 భూగర్భ స్టేషన్లున్నాయి. మార్చి 2018 నుంచి ఆగస్ట్ 2021 వరకు ఐదు దశల్లో పింక్లైన్ కారిడార్లోని వివిధ విభాగాల్లో మెట్రో సర్వీసులు ప్రారంభమయ్యాయి.