చెన్నై: నేటి ఇన్స్టంట్ నూడుల్స్ కాలంలో ఇన్స్టంట్ నూడుల్స్ మాదిరిగా ఇన్స్టంట్ న్యాయాన్ని ప్రజలు ఆశిస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. అయితే తక్షణ న్యాయం కోసం ప్రయత్నిస్తే, నిజమైన న్యాయానికి నష్టం జరుగుతుందన్నది ప్రజలు గుర్తించడం లేదన్నారు. తమిళనాడులోని చెన్నైలో మద్రాస్ హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్కు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. నమక్కల్, విల్లుపురం జిల్లాల్లో కోర్డు భవనాలను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడారు. ప్రపంచం వేగంగా కదులుతున్నందున, తక్షణ సంతృప్తి, తక్షణ అవసరం ప్రతి రంగానికి చేరిందన్నారు. అయితే న్యాయ వ్యవస్థతో సహా అన్ని సంస్థలను ప్రభావితం చేసే అతిపెద్ద సమస్య స్థిరమైన విశ్వాసాన్ని ప్రజల్లో నిర్ధారించడమేనని అన్నారు. ఈ నేపథ్యంలో తీర్పు ఇవ్వడం అంత తేలికైన పని కాదన్నారు. ‘తక్షణ న్యాయం’ కోసం పెరుగుతున్న డిమాండ్ మధ్య ‘నిజమైన న్యాయం’ దెబ్బతింటుందని అభిప్రాయపడ్డారు.
కాగా, న్యాయవ్యవస్థకు బృహత్తరమైన రాజ్యాంగ బాధ్యత ఉందని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. న్యాయమూర్తులుగా ప్రమాణం చేసిన రోజునే ఈ బాధ్యతను ఎంచుకున్నారని గుర్తు చేశారు. సామాజిక వాస్తవాలపైనా న్యాయమూర్తులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అలాగే మారుతున్న సామాజిక అవసరాలు, అంచనాలను జాగ్రత్తగా గమనించాలన్నారు.
మరోవైపు అవసరమైనప్పుడు కోర్టులు, న్యాయవాదులు స్థానిక భాషలు వినియోగించడాన్ని సీజేఐ ఎన్వీ రమణ సమర్థించారు. కేసు కొనసాగుతున్న ప్రక్రియ, పరిణామాలను పార్టీలు సరిగా అర్థం చేసుకునేందుకు ఇదే అవసరమే అని తెలిపారు. అయితే మనకు అర్థం కాని పెండ్లిలోని మంత్రాల మాదిరిగా ఇది ఉండకూడదన్నారు.