జైపూర్: పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాన్ని లెక్కచేయకుండా రాజీనామాలు చేసిన సీఎం అశోక్ గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఇటీవల రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ ముందు ప్రస్తావించగా.. ఆయన తనదైన రీతిలో జవాబిచ్చారు.
రాష్ట్రంలో మా మధ్య (కాంగ్రెస్ శ్రేణులు) ఎలాంటి సవాళ్లు లేవని, అందరం కలిసి పనిచేస్తున్నామని గెహ్లాట్ చెప్పారు. రాజకీయాల్లో ప్రతి ఒక్కరికీ ఆశలు ఉంటాయని, అంతమాత్రాన ఎందుకు మనం వాటిని చెడుగా భావించాలని ప్రశ్నించారు. అయితే, ఆశలు నెరవేర్చుకోవడానికి కొందరు అనుసరించే మార్గం భిన్నంగా ఉంటుందని సచిన్ పైలట్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తామందరం కలిసికట్టుగా గెలిచి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భారతదేశానికి, కాంగ్రెస్ పార్టీకి తమ గెలుపు తప్పనిసరని ఆయన పేర్కొన్నారు.