భోపాల్ : రోడ్డు పక్కన ఎండలో జామకాయలు అమ్ముతున్న వృద్ధురాలికి ఓ పోలీస్ అధికారి భరోసాగా నిలిచిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. బుందేలి బుచర్ అనే పేజ్ ట్విట్టర్లో ఈ వీడియోను షేర్ చేయగా ఇప్పుడది వైరల్గా మారింది. ఈ వీడియోలో రోడ్డుపక్కన ఓ పెద్దావిడ కిలో రూ.20 చొప్పున జామకాయలు అమ్ముతూ కనిపిస్తోంది.
बुजर्ग अम्मा बेच रही थी अमरूद, तभी पहुंच गई पुलिस.. और फिर.. वीडियो ने सोशल मीडिया पर मचाई धूम pic.twitter.com/h3drcjlzox
— Bundeli Bauchhar (@bundelibauchhar) December 5, 2022
కారులో వెళుతూ ఆమెను చూసిన పోలీస్ అధికారి వాహనాన్ని ఆపి ఆమెను మాటల్లో దింపుతాడు. ఎండలో ఒంటరిగా జామకాయలు ఎందుకు అమ్ముతున్నావని అడుగుతాడు. వీడియో చివరిలో ఆమెకు రూ. వంద ఇచ్చి ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని కోరడం నెటిజన్ల హృదయాలను తాకింది. మధ్యప్రదేశ్లోని దమోహ్లో ఈ ఘటన జరగ్గా, అవధేష్ కుమార్ దూబే అనే పోలీస్ అధికారి వృద్ధురాలికి ఆసరాగా నిలిచారు.
ఈ వీడియోను ఇప్పటివరకూ రెండు లక్షల మందికి పైగా వీక్షించారు. పోలీస్ అధికారి దయతో వ్యవహరించిన తీరు అద్భుతమని ఓ యూజర్ కొనియాడగా, సాయం చేసిన వ్యక్తి తన ముఖం కనిపించకుండా ఉండటం ఈ వీడియోలో బెస్ట్ పార్ట్ అని మరో యూజర్ కామెంట్ చేశారు.