న్యూఢిల్లీ, మే 11: కరోనా వ్యాక్సినేషన్లో టీకా సెకండ్ డోస్ తీసుకునేవారికి ప్రాధాన్యమివ్వాలని, వారందరికీ టీకా వేసేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. తాము అందజేసే టీకాల్లో 70 శాతం వరకూ రెండో డోసులకు కేటాయించాలని పేర్కొంది. ఈమేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. ‘కేంద్రం సరఫరా చేసే టీకాల్లో 70 శాతాన్ని రెండోడోసు వేసుకునేవారికోసం తీసి ఉంచాలి. మిగిలిన 30 శాతాన్ని తొలి డోసు కోసం రిజర్వు చేయవచ్చు. దీనిపై రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉంది. కావాలంటే, రెండోడోసుల కోసం మొత్తం 100 శాతం (కేంద్రం పంపించిన టీకాల్లో) కూడా కేటాయించవచ్చు. టీకా రెండుడోసులు తీసుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఈ మేరకు ప్రచారం చేపట్టాలి’ అని సూచించింది. వ్యాక్సినేషన్లో ప్రాధాన్యవర్గాలకు (ఆరోగ్య సిబ్బంది, కరోనాపై ముందుండి పోరాడుతున్న ఫ్రంట్లైన్ వర్కర్లు, 45 ఏండ్లు దాటిన వారికి) ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు పంపిణీ చేసే టీకాల గురించి ఇకమీదట ప్రతీ 15 రోజుల వివరాలను ముందుగానే వెల్లడిస్తామని తెలిపింది. దీనికి అనుగుణంగా వ్యాక్సినేషన్పై ప్రణాళికలు రూపొందించుకోవాలని కోరింది.
టీకాల వృథాను అరికట్టటానికి చర్యలను తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. జాతీయ సగటు వృథాకన్నా ఎక్కువ వృథా చేస్తే.. ఆ అదనపు మొత్తాన్ని సదరురాష్ట్రానికి/కేంద్రపాలిత ప్రాంతానికి పంపిం చే టీకాల్లో తగ్గిస్తామని తెలిపింది. టీకాలను ఉత్పత్తి చేస్తున్న ప్రైవేటు కంపెనీల నుంచి రాష్ట్రాలు సొంతంగా సమకూర్చుకోవచ్చని
సూచించింది.
న్యూఢిల్లీ: కొన్ని రాష్ర్టాలు ప్రజారోగ్యంపై రాజకీయం చేస్తున్నాయని కేంద్రం ఆరోపిస్తున్నది. కరోనా సంక్షోభం, వ్యాక్సినేషన్ కార్యక్రమం విషయంలో కేంద్రం, పలు రాష్ర్టాలు కొన్ని వారాలుగా పరస్పరం విమర్శలు ఎక్కుపెట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 18 ఏండ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ ఈ నెల 1 నుంచి ప్రారంభించాలని కేంద్రం నిర్దేశించగా… కొన్ని రాష్ర్టాల్లో టీకాలు వేసే కార్యక్రమం మందగించిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. తమ వద్ద సరిపడా టీకా నిల్వలు లేవని ఆ రాష్ర్టాలు కేంద్రంవైపే వేలెత్తి చూపుతున్నాయి. ఈ వైఖరిని కేంద్రం తప్పుపడుతున్నది. కొన్ని రాష్ర్టాలు తమకు కావలసినన్ని డోసులు రాకపోతే… అసలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్నే ప్రారంభించడం లేదని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ‘ఇవాళ మనకు పరిమితమైన స్టాకులు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఎలాంటి రాజకీయాలు చేయకుండా మనకు ఉన్న నిల్వలతోనే వ్యాక్సినేషన్ ప్రారంభించాలి’ అని అధికారి సూచించారు.