న్యూఢిల్లీ/హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మె రెండోరోజు విజయవంతమైంది. ఈ మేరకు సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల ఫోరం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. బంద్ కారణంగా బ్యాంకింగ్, రవాణా రంగాలు ప్రధానంగా ప్రభావితమయ్యాయి. సమ్మెకు ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల ప్రైవేటీకరణ నిలిపేయడం, కార్మిక చట్టాలకు ప్రతిపాదించిన సవరణలను ఉపసంహరించుకోవడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచడం తదితర డిమాండ్లతో ట్రేడ్ యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కేరళ, పశ్చిమబెంగాల్, తమిళనాడు, సిక్కిం, అరుణాచల్ప్రదేశ్లో రెండో రోజు సమ్మె ప్రభావం కన్పించింది.
సార్వత్రిక సమ్మె రెండో రోజు తెలంగాణలో విజయవంతమైంది. కార్మికులకు టీఆర్ఎస్తో పాటు వామపక్ష పార్టీలు అండగా నిలిచాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రత్యక్షంగా పాల్గొన్నాయి. సింగరేణి కార్మికులు పూర్తి స్థాయిలో పాల్గొనడంతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. అలాగే 17 వేల మంది బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,400 పరిశ్రమల్లో సమ్మె పూర్తిగా జరిగిందని కార్మిక సంఘం నేతలు చుక్కరాములు, పాలడుగు భాస్కర్లు తెలిపారు. దేశ వృద్ధి అవకాశాలను మెరుగుపరచకుండా, ప్రజలకు జీవనోపాధి లేకుండా చేస్తూ, కార్పొరేట్ దోపిడీదారుల కోసమే ప్రధాని మోదీ నిరంకుశ విధానాలు అవలంబిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ఆరోపించారు. కాగా, వ్యవసాయ చట్టాలపై వెనక్కి తగ్గినట్టే ఎల్ఐసీ-ఐపీఓ నిర్ణయంపై తగ్గాలని, లేదంటే పోరాటాన్ని మరింత ఉద్ధృ తం చేస్తామని సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి టీవీఎస్ఎన్ రవీంద్రనాథ్, డివిజనల్ ప్రధాన కార్యదర్శి జి.తిరుపతయ్య హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు సంస్థలను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని విద్యుత్తు కార్యాలయాల్లో ఉద్యోగ సంఘాలు ధర్నా నిర్వహించాయి. విద్యుత్తు సంస్థల రక్షణకు మరో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నదని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీ కన్వీనర్ ఎన్ శివాజీ అన్నారు. ఖైరతాబాద్లోని విద్యుత్తు సౌధ వద్ద నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు.