చండీగఢ్: కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ను తక్షణం పంజాబ్కు బదిలీ చేయాలని ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పంజాబ్ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని శుక్రవారం ప్రవేశపెట్టారు. కేంద్రపాలిత ప్రాంతం నిర్వహణలో సమతుల్యతను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది ఆరోపించారు. పంజాబ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 1966 ప్రకారం, పంజాబ్ రాష్ట్రాన్ని హర్యానా రాష్ట్రంగా, చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతంగా విభజించడంతోపాటు పంజాబ్లోని కొన్ని ప్రాంతాలను అప్పటి కేంద్ర పాలిత ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్కు ఇచ్చారని ఆ తీర్మానంలో మాన్ పేర్కొన్నారు. నాటి నుంచి భాక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డ్ వంటి ఉమ్మడి ఆస్తుల నిర్వహణలో పంజాబ్, హర్యానా రాష్ట్ర నామినీలకు కొంత నిష్పత్తిలో మేనేజ్మెంట్ పదవులు ఇవ్వడం ద్వారా సమతుల్యం పాటిస్తున్నారని తెలిపారు.
అయితే ఇటీవల అనేక చర్యల ద్వారా ఈ సమతుల్యతను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని రెండు వారాల కిందటే సీఎం పదవిని చేపట్టిన భగవంత్ మాన్, తీర్మానంలో ఆరోపించారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల అధికారులతో సాంప్రదాయకంగా భర్తీ చేసే భాక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డు సభ్యుల పోస్టులను అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ అధికారులతో భర్తీ కోసం కేంద్రం ప్రకటన జారీ చేసిందని విమర్శించారు.
కాగా, చండీగఢ్ పరిపాలన కూడా 60:40 నిష్పత్తిలో పంజాబ్, హర్యానా అధికారులు నిర్వహించేవారని సీఎం భగవంత్ మాన్ పేర్కొన్నారు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం చండీగఢ్కు బయటి అధికారులను నియమించిందని ఆరోపించారు. అలాగే చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్లోని ఉద్యోగులకు సెంట్రల్ సివిల్ సర్వీస్ నియమాలను ప్రవేశపెట్టిందని విమర్శించారు. గతం నుంచి అమలవుతున్న నిబంధనలకు ఇది పూర్తి విరుద్ధంగా ఉన్నదని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చండీగఢ్ను తక్షణం పంజాబ్కు బదిలీ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
మరోవైపు చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్లోని ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు లభిస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతవారం ప్రకటించారు. చండీగఢ్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60కి పెంచుతున్నట్లు తెలిపారు. అలాగే పిల్లల సంరక్షణ కోసం మహిళా ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న ఏడాది సెలవు బదులు రెండు సంవత్సరాల సెలవు మంజూరు చేస్తామని చెప్పారు. చండీగఢ్ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ డిమాండ్లను నెరవేస్తున్నామన్నారు. మంగళవారం జారీ చేసిన కొత్త సర్వీస్ నిబంధనలు ఏప్రిల్ 2 నుంచి అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.
కాగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ఈ ప్రకటన పంజాబ్లో పెద్ద దుమారం రేపింది. చండీగఢ్పై పంజాబ్ పెత్తనాన్ని తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని ఆ రాష్ట్రం ప్రభుత్వంతోపాటు ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. ఫెడరలిజం స్ఫూర్తికి వ్యతిరేకంగా కేంద్ర నిర్ణయం ఉందని విమర్శించాయి. చండీగఢ్పై హక్కు కోసం పంజాబ్ ప్రభుత్వం గట్టిగా పోరాడుతుందని సీఎం భగవంత్ మాన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో చండీగఢ్ను తక్షణం పంజాబ్కు బదిలీ చేయాలంటూ అసెంబ్లీలో తీర్మానాన్ని శుక్రవారం ఆయన ప్రవేశపెట్టారు. బీజేపీ తప్ప అన్ని పార్టీలు మద్దతు ప్రకటించడంతో ఈ తీర్మానం పంజాబ్ అసెంబ్లీలో ఆమోదం పొందింది.