లక్నో: రానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణులు బీజేపీకి ఓటు వేయరన్న ఆశాభావంతో తాను ఉన్నట్లు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి అన్నారు. బ్రాహ్మణ సమాజంతో కనెక్ట్ కావడానికి బీఎస్పీ ప్రధాన కార్యదర్శి ఎస్సీ మిశ్రా నాయకత్వంలో ఈ నెల 23న అయోధ్య నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. బీఎస్పీ పాలనలో మాత్రమే బ్రాహ్మణుల ప్రయోజనాలు నెరవేరుతాయన్న భరోసా వారిలో కలిగిస్తామని చెప్పారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో దేశ ప్రయోజనాలకు సంబంధించిన విషయాలను లేవనెత్తాలని పార్టీ ఎంపీలను ఆదేశించినట్లు మాయావతి తెలిపారు. దేశ ప్రజలు కేంద్ర ప్రభుత్వం నుండి జవాబుదారీతనం కోరే అనేక విషయాలు ఉన్నాయని చెప్పారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం చూపిన ఉదాసీనత చాలా విచారకరమన్నారు.
రైతుల అంశంతోపాటు, ఇంధనం, ఎల్పీజీ ధరలు, ద్రవ్యోల్బణం, కరోనా వ్యాక్సినేషన్ వంటి అనేక అంశాలను బీఎస్పీ ఎంపీలు పార్లమెంట్లో లేవనెత్తుతారని మాయావతి తెలిపారు. ఈ సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని జవాబుదారీగా చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు తమతో కలిసి రావాలని ఆమె పిలుపునిచ్చారు.