న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: ఇటీవల టర్కీ భూకంప దృశ్యాలు ఎంత భయానకంగా ఉన్నాయో ప్రపంచమంతా చూసింది. పేకమేడలా కూలిన భవనాల కింద ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి భూకంపాలు భారత్లో వస్తే? దానికి ఉపాయాన్ని కనుగొన్నారు ఐఐటీ మండి పరిశోధకులు. ప్రత్యేక గణిత పద్ధతిలో ప్లాస్టిక్, లోహాల సింథటిక్ మిశ్రమంతో తయారైన ద్విమితీయ (2డీ) మెటామెటీరియల్స్ భవనాలకు రక్షణ కల్పిస్తుందని కనుగొన్నారు. ‘గణిత పునాది’ అనే కొత్త పద్ధతిని డాక్టర్ అర్పన్ గుప్తా నేతృత్వంలోని పరిశోధకుల బృందం అభివృద్ధి చేసింది. 2డీ మెటామెటీరియల్స్ ప్రత్యేకత ఏమిటంటే, భూకంప తరంగాలను ఇవి దారి మళ్లిస్తాయి. వెనక్కి పంపుతాయి. సిస్మిక్ తరంగాలను, వాటితో వచ్చే శక్తిని బలహీనం చేస్తాయి. తద్వారా పునాది దెబ్బతినకుండా, పగుళ్లు ఏర్పడకుండా రక్షణ ఏర్పడుతుంది. సరికొత్త టెక్నాలజీ కూడిన ఈ డిజైన్తో ఇండ్లు, భవనాలు, అపార్ట్మెంట్స్ పునాది నిర్మిస్తే భూకంప ప్రమాదాన్ని తప్పించవచ్చు అన్నది పరిశోధకుల సిద్ధాంతం. భూకంప తరంగాలను వెనక్కి పంపే ‘ఆవర్తిత’ ఆకృతి 2డీ మెటామెటీరియల్స్లో ఉంటుంది.
భూకంపం సంభవించినప్పుడు ఈ ‘గణిత పునాది’ ఎలా ఉంటుందన్నది కంప్యూటర్లో పరీక్షించారు. కాంక్రీట్ భవనంలో పెద్ద ఎత్తున ప్రకంపనాలు ఏర్పడగా, మెటామెటీరియల్స్ భవనంలో స్వల్పంగా ఏర్పడ్డాయని కంప్యూటర్ పరీక్షలో తేలింది. అంతేకాదు కంపనాల వేగాన్ని తగ్గించినట్టు గుర్తించారు.