తిరువనంతపురం: కేరళలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్కు, పినరయి విజయన్ ప్రభుత్వానికి మధ్య మొదలైన వివాదం చినికిచినికి గాలివానలా మారింది. ఆఖరికి గవర్నర్ను రాష్ట్ర యూనివర్సిటీల ఛాన్సెలర్ పదవి నుంచి తప్పించేందుకు వీలు కల్పించే చట్టం కోసం కేరళ ప్రభుత్వం అసెంబ్లీలో ఒక బిల్లును ప్రవేశపెట్టి, పాస్ చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపే వరకు వెళ్లింది.
అయినా, గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. కేరళ ప్రభుత్వ తీరు హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. వివాదంపై మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన.. తనను ఛాన్సెలర్ పదవి నుంచి తప్పించడం కోసం కేరళ సర్కారు అసెంబ్లీలో ఆమోదింపజేసుకున్న బిల్లు చట్ట వ్యతిరేకమైనదా.. కాదా..? అని ప్రశ్నించారు.
ముందుగా ఆ బిల్లు తనకు వ్యతిరేకమైనదా.. కాదా.. అనే విషయం ముఖ్యం కాదని, అది చట్ట వ్యతిరేకమైనదో.. కాదో.. ఆలోచించాల్సిన అవసరం ఉందని కేరళ గవర్నర్ వ్యాఖ్యానించారు. ఇలాంటి బిల్లులు చెల్లుబాటు కావని, గవర్నర్కు రాజ్యాంగం ఎలాంటి అధికారాలను అయితే కట్టబెట్టిందో.. ఆ అధికారాల ప్రకారమే తాను నడుచుకుంటానని చెప్పారు.