పాట్నా: బీజేపీతో చేతులు కలిపి ఉంటే లాలూజీని రాజా హరిశ్చంద్ర అనేవారని ఆయన కుమారుడు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విమర్శించారు. పశు దాణా కుంభకోణానికి సంబంధించిన ఐదో కేసులో రాంచీ సీబీఐ కోర్టు సోమవారం తీర్పు వెల్లడించింది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు ఐదేండ్ల జైలు శిక్షతోపాటు రూ.60 లక్షల జరిమానా విధించింది. ఈ తీర్పుపై లాలూ చిన్న కుమారుడు తేజస్వి యాదవ్ స్పందించారు. లాలూజీ బీజేపీతో చేతులు కలిపి ఉంటే రాజా హరిశ్చంద్ర అని పిలిచేవారని ఎద్దేవా చేశారు. అయితే ఆయన నేడు ఆర్ఎస్ఎస్, బీజేపీపై పోరాడుతున్నారని, అందుకే జైలు శిక్ష అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దీనికి తాము భయపడబోమని అన్నారు.
దేశంలో దాణా కుంభకోణం తప్ప మరే స్కామ్ జరుగలేదా అని తేజస్వి యాదవ్ ప్రశ్నించారు. బీహార్లో దాదాపు 80 కుంభకోణాలు జరిగాయని, కానీ సీబీఐ, ఈడీ, ఎన్ఐఏ ఎక్కడ ఉన్నాయి, వాటికి ఎందుకు పట్టలేదు అని నిలదీశారు. దేశంలో ఒకే ఒక స్కామ్, ఒక్క నాయకుడిపైనే దర్యాప్తు సంస్థలు దృష్టిపెట్టాయని విమర్శించారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలను సీబీఐ మరిచిపోయిందని ఆయన ఆరోపించారు.
కాగా, కోర్టు తీర్పుపై తాను వ్యాఖ్యానించబోనని తేజస్వి యాదవ్ అన్నారు. అయితే ఇదే చివరి తీర్పు కాదన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఉన్నాయని, ఉన్నత న్యాయస్థానాల్లో తాము సవాల్ చేస్తామని తెలిపారు. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో ఊరట లభిస్తుందని తాము ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.