న్యూఢిల్లీ: బ్రహ్మణ సామాజికవర్గానికి వ్యతిరేకంగా మాట్లాడిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్రామ్ మాంఝీని విమర్శిస్తూ బీజేపీ నాయకుడు గజేంద్ర ఝా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాంఝీ నాలుక కోసుకుని తన ముందుకు తెచ్చిన బ్రాహ్మణుడికి రూ.11 లక్షలు బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. పైగా మాంఝీ విలువ 11 పైసలు కూడా ఉండదని వ్యాఖ్యానించారు. ‘నేను ఒక ప్రకటన చేయదల్చుకున్నా. ఏ బ్రాహ్మణుడైతే జితన్ రామ్ మాంఝీ నాలుక తెగ్గోసి నా ముందుకు వస్తాడో అతనికి నేను రూ.11 లక్షలు బహుమతిగా ఇస్తా. కాకపోతే మాంఝీ విలువ 11 పైసలు కూడా చేయదు’ అని ఝా ఎద్దేవాచేశారు.
జితన్రామ్ మాంఝీ ఈ నెల 19న ఓ వేదికపై ప్రసంగిస్తూ.. ‘నేను నా సామాజికవర్గ ప్రజలకు చెప్పేదేమిటంటే.. ఈ రోజుల్లో నమ్మకం పేరుతో కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నారు. కానీ, పేదల సంక్షేమం పట్టించుకోవడంలేదు. పూర్వం షెడ్యూల్డ్ కులాలవాళ్లు పూజలను నమ్మేవారు కాదు. ఇప్పుడు పండితులు ఎస్సీల ఇండ్లలోకి వచ్చి పూజలు చేస్తున్నారు. అయితే, అక్కడ వాళ్లు తినడానికి ఏమిచ్చినా తిరస్కరిస్తున్నారు, కానీ డబ్బులను మాత్రం స్వీకరిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. తర్వాత ఈ వ్యాఖ్యలపై మాంఝీ క్షమాపణ చెప్పారు.