న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని బాలకోట్ ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం (ఐఏఎఫ్) జరిపిన మెరుపు దాడుల్లో హీరోగా నిలిచిన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ను గ్రూప్ కెప్టెన్ ర్యాంక్కు ఐఏఎఫ్ ప్రమోట్ చేసింది. భారత వైమానిక దళంలోని గ్రూప్ కెప్టెన్ ర్యాంకు, ఇండియన్ ఆర్మీలో కర్నల్ ర్యాంక్తో సమానం.
2019 ఫిబ్రవరిలో జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్పై ఉగ్రవాదులు బాంబు దాడి చేశారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో జవాన్లు అమరులుకాగా, పలువురు గాయపడ్డారు. దీనికి ప్రతీకారంగా ఫిబ్రవరి 27న భారత వాయుసేన మెరుపు దాడులు చేసింది. బాలకోట్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిక్షణ శిబిరాలను బాంబులతో పేల్చివేసింది. ఈ ఘటనలో వందల సంఖ్యలో ఉగ్రవాదులు మరణించారు.
కాగా, భారత వాయుసేన సర్జికల్ స్ట్రైక్స్ను అడ్డుకునేందుకు అత్యాధుక ఎఫ్-16 ఫైటర్ జెట్స్ను పాకిస్థాన్ రంగంలోకి దించింది. మిగ్-21 యుద్ధ విమానాన్ని నడుపుతున్న వింగ్ కమాండర్ అభినందన్, పాక్కు చెందిన ఒక ఎఫ్-16ను కూల్చివేశారు. ఈ సందర్భంగా కూలిపోతున్న మిగ్-21 నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అయితే పాక్ ఆక్రమిత కశ్మీర్లో దిగిన ఆయనను పాక్ ఆర్మీ నిర్బంధించింది.
వింగ్ కమాండర్ అభినందన్ను సురక్షితంగా తమకు అప్పగించాలని భారత్ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. భారత్ నుంచి తీవ్ర ఒత్తిడి, అంతర్జాతీయ జోక్యంతో పాక్ దిగివచ్చింది. అదే రోజు రాత్రి వేళ అభినందన్ను భారత సైనిక అధికారులకు అప్పగించింది. ఈ నేపథ్యంలో శౌర్య చక్ర అవార్డు అందుకున్న వింగ్ కమాండర్ అభినందన్ను తాజాగా గ్రూప్ కెప్టెన్ ర్యాంక్కు ఐఏఎఫ్ ప్రమోట్ చేసింది.