తల్లిదండ్రుల జ్ఞాపకార్థం యెగ్గె మల్లేశం అదనపు తరగతి గదుల నిర్మాణం
మన్సూరాబాద్, ఏప్రిల్ 27: తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం ఓ సర్కారు బడిని అభివృద్ధి చేస్తున్నారు. తన తల్లిదండ్రులు యెగ్గె రాజమ్మ, రాములు కుర్మ జ్ఞాపకార్థం సొంత నిధులతో నాగోల్ డివిజన్ పరిధి నాగోల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరు తరగతి గదులను నిర్మిస్తున్నారు. మంగళవారం ఆ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద, మధ్య తరగతి విద్యార్థులు విద్యను అభ్యసించే సర్కారు బడి అభివృద్ధికి తోడ్పాటును అందించటం సంతోషాన్ని ఇస్తుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికోసం రాజకీయ నాయకులు, సంఘ సేవకులు ముందుకు వచ్చి సహకారం అందించాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలను తలదన్నే రీతిలో విద్యాబోధనలు అందిస్తుందని తెలిపారు.