Tejas LCA Mark-1A | ప్రస్తుతం నెలకొన్న అస్థిర, అనిశ్చిత భౌగోళిక పరిస్థితుల్లో బలమైన, నమ్మకమైన సైన్యం అవసరమని భారత వైమానిక దళం (IAF) చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి అన్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా రూ.3.15లక్షల కోట్లతో ఫైటర్ జెట్స్, స్పై ప్లేన్స్, ఛాపర్స్, మిసైల్స్ను దేశీయంగానే సమకూర్చుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రాబోయే ఏడు ఎనిమిదేళ్లలో పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇకపై మిగ్-21 యుద్ధ విమానాలు భారత వైమానిక విభాగంలో భాగం కాబోవన్నారు. వీటి స్థానంలో LAC తేజస్ విమానాలు అందుబాటులోకి రానున్నాయన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.
ఇండో-పసిఫిక్ ప్రాంతం కొత్త ఆర్థిక, వ్యూహాత్మక కేంద్రమన్నారు. ఇది సవాళ్లతో పాటు అవకాశాలను సైతం ఇస్తుందన్నారు. ఈ ప్రాంతంలో భారతదేశ బలాన్ని అంచనా వేయడంలో మూలస్తంభంగా ఉంటుందన్నారు.
తేజస్ ఫైటర్ జెట్కు చెందిన LCA Mark-1A కన్సైన్మెంట్ల కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్లు వీఆర్ చౌదరి పేర్కొన్నారు. ఎల్సీఏ Mark-1A కోసం ఒప్పందంపై సంతకాలు చేశామన్నారు. అలాంటివే మరో 97 కావాలన్నారు. మొత్తం 180 విమానాలు అందుబాటులోకి రానున్నాయన్నారు. 2025 నాటికి మిగ్-21 ఫైటర్ జెట్లను తొలగిస్తామని, ఎల్సీఏ తేజస్ను ఎయిర్ఫోర్స్ ఫ్లీట్లో చేర్చనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ప్రతిపాదన ఇదేనని చెప్పారు.
ఎల్సీఏ మార్క్-ఏ తేజర్ ఎయిర్క్రాఫ్ట్కి అప్గ్రేడ్ వెర్షన్. ఇందులో అనేక అత్యాధునిక పరికరాలు అమర్చారు. రాడాన్ వార్నింగ్ రిసీవర్, ఆత్మరక్షణ కోసం జామర్ పాడ్ తదితర అత్యాధునిక ఫీచర్స్ ఉన్నాయి. ఈ యుద్ధ విమానాన్ని గాలి నుంచి గాలిలోకి.. గాలి నుంచి ఉపరితలంపై అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేస్తుంది. ఇక ఈ ఫైటర్ జెట్ బరువు సైతం తక్కువగానే ఉంటుంది. దీన్ని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మాత్రమే తయారు చేస్తుంది.
వీఆర్ చౌదరి మాట్లాడుతూ తాము ఇంటెలిజెన్స్, నిఘా, ఐఎస్ఆర్ ద్వారా సరిహద్దుల వెంబడి పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నామన్నారు. సరిహద్దుల్లో వనరులు పెంచడంపై దృష్టి పెడతామన్నారు. కార్యాచరణ ప్రణాళికలు డైనమిక్గా ఉంటాయన్నారు. ఏ విషయంలోనైనా అభివృద్ధి చెందుతున్న సమయంలో మనం ఎదుర్కొనే పరిస్థితిని బట్టి మారుతుంటుందన్నారు. ప్రత్యర్థి బలాన్ని నిజంగా ఎదుర్కోలేని ప్రదేశాల్లో మెరుగైన వ్యూహాలతో దీటుగా బదులిస్తామన్నారు. సమాచారం ఆధారంగానే ఐఎస్ఆర్ (Intelligence, Surveillance and Reconnaissance) ప్లాన్లలో మార్పులు చేయడం జరుగుతుందన్నారు.
ఎంఆర్ఎఫ్ఏ (మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్) విషయం చాలా కాలంగా పెండింగ్లో ఉందని, దీనిపై కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. రష్యా నుంచి మూడు యూనిట్ల ఎస్-400 క్షిపణి వ్యవస్థను అందుకున్నామని, మిగిలిన రెండు వచ్చే ఏడాదిలోగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం కారణంగా క్షిపణులను పొందడంలో జాప్యం జరుగుతోందన్నారు. వచ్చే వచ్చే ఏడెనిమిదేళ్లలో రూ.2.5 నుంచి రూ.3 లక్షల కోట్ల విలువైన మిలిటరీ ప్లాట్ఫారమ్లు, హార్డ్వేర్లను కొనుగోలు చేయాలని భారత వైమానిక దళం చూస్తోందన్నారు.
చైనా, పాకిస్థాన్ల మధ్య సాంకేతికత మార్పిడి జరుగుతోందని ఎయిర్ఫోర్స్ చీఫ్ చౌదరి పేర్కొన్నారు. పాకిస్తాన్ జేఎఫ్-17 యుద్ధ విమానాలను తయారు చేస్తోందని, జే-10 విమానాలను సైతం జోడిస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో టెక్నాలజీ ద్వారా దాడులు జరిగిన సందర్భంలో తాము అదే టెక్నాలజీతో స్పందిస్తామన్నారు. ఎక్కడైనా టెక్నాలజీని ఉపయోగించుకోలేకపోతే శిక్షణ, వ్యూహంతో విజయం సాధిస్తామన్నారు.