చెన్నై : భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ కూలిన ఘటనలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్తో పాటు మరో 13 మంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ప్రమాదానికి గురైన ఎంఐ17వీ5 (Mi-17V5) హెలికాప్టర్కు చెందిన బ్లాక్బాక్స్ కోసం అన్వేషిస్తున్నారు. గురువారం వింగ్ కమాండర్ భరద్వాజ్ బ్లాక్ బాక్స్ సెర్చింగ్ సాగుతోంది. బ్లాక్ బాక్స్లో 13 గంటల పాటు నిడివి ఉన్న డేటా నిక్షిప్తమై ఉంటుంది. క్రాష్ అయిన సమయంలో మాత్రం ప్రమాదానికి ముందు అరగంట ముందు ఏం జరిగిందన్న సమాచారం అందివ్వనున్నది.
బుధవారం సీడీఎస్ జనరల్ రావత్, ఆయన భార్యతో సహా 14 మంది వ్యక్తులతో ఐఏఎఫ్కు చెందిన సూలూరు ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన అనంతరం కూనూర్లో ల్యాండ్ అవడానికి కొద్ది నిమిషాల ముందు కూలిపోయిన విషయం తెలిసిందే. బిపిన్ రావత్ దంపతులతో పాటు మరో 11 మంది మృత్యువాతపడగా.. ఐఏఎఫ్ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ప్రాణాలతో పడ్డారు. 80శాతం కాలిన గాయాలతో వెల్లింగ్టన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఏదైనా విమాన ప్రభావం జరిగితే అధికారులు మొదట బ్లాక్బాక్స్ కోసం అన్వేషిస్తారు. దీని ఆధారంగానే దర్యాప్తు చేపడుతారు. బ్లాక్ బాక్స్ అనేది ఆరెంజ్ కలర్లోనే ఎందుకుంటుందో అనేదాని వెనక కూడా ఒక కారణం ఉంది. సాధారణంగా ప్రమాదసమయాల్లో ఒకవేళ మంటలు చెలరేగితే అన్నీ తగలబడిపోయే అవకాశం ఉంది. ఆ సమయంలో నారింజ రంగులో ఉన్న ఈ బ్లాక్ బాక్స్ను గుర్తుపట్టేలా సులభంగా ఉంటుంది. ఈ బ్లాక్ బాక్స్ను ప్రతికూల వాతావరణంలో కూడా దృఢంగా ఉండేలా డిజైన్ చేస్తారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా, నీటిలో మునిగినా ఎలాంటి డేటా ధ్వంసం కాకుండా ఉండేలా అన్ని జాగ్రత్త చర్యలతో దీన్ని రూపొందిస్తారు. సీడీఎస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్కు సంబంధిన బ్లాక్ బాక్స్ దొరికితే ప్రమాదానికి గల కారణాలు, అంతకు ముందు ఏం జరిగిందనే విషయాలు బయటపడనున్నాయి.