న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి, గోవా మాజీ ముఖ్యమంత్రి, దివంగత మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. ఆ ప్రెస్ మీట్లోనే గోవా అసెంబ్లీ ఎన్నికలపై తన నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఆయన ఓ జాతీయ మీడియా సంస్థకు తెలియజేశారు. గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం గురువారం అభ్యర్థుల జాబితాను ప్రకటించిన బీజేపీ.. అందులో ఉత్పల్ పారికర్కు చోటు కల్పించలేదు. ఈ నేపథ్యంలో ఆయన ప్రెస్ మీట్కు సిద్ధపడటం ప్రాధాన్యం సంతరించుకుంది.
గోవాలో ఇది హాట్టాపిక్గా మారింది. ఉత్పల్ పారికర్ బీజేపీకీ రాజీనామా చేయబోతున్నారనే ప్రచారమూ జరుగుతున్నది. ఒకవేళ రాజీనామా చేస్తే పనాజీ నుంచి ఇండిపెండెంట్గా బరిలో దిగుతారా..? లేదంటే కేజ్రివాల్ ఆఫర్ను స్వీకరించి ఆప్ తరఫున పోటీ చేస్తారా..? అదీకాకపోతే మరేదైనా కొత్త ఆలోచనతో ముందుకొస్తారా..? అని విషయాలపై గోవా జనం తీవ్రంగా చర్చించుకుంటున్నారు.
గోవా అసెంబ్లీలో మొత్తం 40 స్థానాలున్నాయి. అందులో 34 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది. కానీ, ఉత్పల్ పారికర్ పేరు ఆ జాబితాలో లేదు. మరో ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నప్పటికీ.. ఉత్పల్ పారికర్ కోరుకున్న పనాజీ స్థానం భర్తీ అయిపోయింది. ఉత్పల్ పారికర్ ఎప్పటి నుంచో కోరుతున్నా పట్టించుకోకుండా ఇటీవల కాంగ్రెస్ నుంచి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేకు పనాజీ సీటు కేటాయించినట్లు బీజేపీ ప్రకటించింది. దాంతో పారికర్ ఇవాళ ప్రెస్ మీట్ పెడుతున్నారు.