కోల్కతా: పశ్చిమబెంగాల్ ఉపఎన్నికల కోసం నామినేషన్ల పర్వం కొనసాగుతున్నది. బెంగాల్లోని మూడు నియోజకవర్గాలు భవానీపూర్, షంషేర్గంజ్, జాంగీర్పూర్ అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 30న పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. అయితే, మమతాబెనర్జి స్వయంగా బరిలో దిగుతున్న భవానీపూర్ నియోజకవర్గ ఉపఎన్నిక ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అక్కడ మమతాబెనర్జిపై బీజేపీ అభ్యర్థిగా న్యాయవాది ప్రియాంక టిబ్రివాల్ ( Priyanka Tibrewal ) బరిలో దిగుతున్నారు.
మమతాబెనర్జి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేయగా, ప్రియాంకా టిబ్రివాల్ రేపు (సోమవారం) రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు సమర్పించనున్నట్లు తెలిపింది. నేను రేపు నామినేషన్ వేస్తున్నా. పశ్చిమబెంగాల్ ప్రజలకు జీవించే హక్కు ఉన్నది. ఆ హక్కును మమతాబెనర్జి నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కాలరాస్తున్నది. నేను ఈ ఎన్నికల్లో గెలిచి బెంగాల్ ప్రజల తరఫున పోరాడుతా అని ప్రియాంకా టిబ్రివాల్ చెప్పారు.