హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)కు .. ఆదాయపన్ను శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల నుంచి చంద్రబాబు నాయుడుకు సుమారు 118 కోట్లు ముడుపుల రూపంలో ముట్టినట్లు ఐటీ శాఖ ఆరోపించింది. చట్టం ప్రకారం ఆ సొమ్ము అప్రకటిత ఆదాయంగా పేర్కొన్నది. బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా చంద్రబాబు ముడుపులు పొందినట్లు ఆదాయ పన్ను శాఖ అధికారులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు.
ఈ కేసులో చంద్రబాబు అభ్యంతరాలను తిరస్కరించిన తర్వాత.. ఆగష్టు 4వ తేదీనే హైదరాబాద్ ఐటీ సెంట్రల్ సర్కిల్ కార్యాలయం సెక్షన్ 153C కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. షాపూర్జి పల్లోంజి (ఎస్ పి సి ఎల్), ఎల్ అండ్ టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫోనిక్స్ ఇన్ఫ్రా& పౌర్ ట్రేడింగ్ అనే సబ్ కాంట్రాక్టు సంస్థ ద్వారా నగదు మళ్లింపు జరిగినట్లు తేలింది.