న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లోని రియాసి(Reasi Attack) జిల్లాలో పర్యాటకుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఆ కాల్పుల్లో అదుపు తప్పిన బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతిచెందగా, 41 మంది గాయపడ్డారు. కొండల్లోంచి సుమారు 25 నిమిషాల పాటు గన్ ఫైరింగ్ జరిగింది. ఆ బుల్లెట్లు దూసుకొస్తుంటే బస్సులో ఉన్న వారి పరిస్థితి భయానకంగా మారింది. అయితే ఢిల్లీకి చెందిన భవానీ శంకర్ ఆ బస్సులోనే ప్రయాణించాడు. పెళ్లి వార్సికోత్సవం సందర్భంగా శంకర్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి వైష్ణవోదేవి ఆలయ దర్శనం కోసం వెళ్లాడు. అయితే రియాసి జిల్లాలోని శివ కోహరి ఆలయానికి వెళ్తున్న సమయంలో బస్సుపై గన్ ఫైరింగ్ జరిగింది. బుల్లెట్లు దూసుకొస్తున్న ఆ క్షణంలో.. ముందుకు వంగిపోయానని, తన ఇద్దరు పిల్లల్ని బస్సు సీటు కింద నక్కి పెట్టినట్లు శంకర్ తెలిపాడు. దాదాపు 20 నుంచి 25 నిమిషాల పాటు బుల్లెట్ల వర్షం కొనసాగిందని, ఆ భయానక పరిస్థితుల్ని ఎన్నటికీ మరిచిపోలేనని శంకర్ చెప్పాడు. భవానీ శంకర్తో పాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. వాళ్లు జమ్మూకశ్మీర్లోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయిదేళ్ల కూతురు దీక్షా రాఘవ్, మూడేళ్ల కుమారుడు రాఘవ్తో పాటు భార్య రాధా దేవి ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు.