న్యూఢిల్లీ: బ్యూరోక్రాట్లు, ప్రధానంగా పోలీస్ అధికారులు ప్రవర్తిస్తున్న తీరుపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని బ్యూరోక్రాట్లు, ముఖ్యంగా పోలీస్ అధికారుల ప్రవర్తనపై తనకు చాలా అభ్యంతరాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీస్ అధికారుల దారుణాలు, వారికి వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులను పరిశీలించేందుకు హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలన్న భావన తనకు కలిగిందన్నారు. అయితే ప్రస్తుతం దీనిని అమలు చేయడం లేదని, ఆ ఆలోచనను రిజర్వ్ చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
దేశద్రోహం, దోపిడీ, అక్రమాస్తులు కలిగి ఉండటం వంటి నేరారోపణలతో సస్పెండ్ అయిన ఛత్తీస్గఢ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గుర్జిందర్ పాల్ సింగ్, అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ హిమ కోహ్లీలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్పై మరో విడత విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు.
సెప్టెంబర్ 27న ఈ పిటిషన్ విచారణ సందర్భంగా కూడా సీజేఐ ఎన్వీ రమణ ఘాటుగా వ్యాఖ్యానించారు. సస్పెండైన పోలీస్ అధికారిపై ఉన్న ప్రతి కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కోరడం సరికాదన్నారు. ‘మీరు ప్రభుత్వంతో మంచిగా ఉన్నప్పుడు దోచుకుంటారు. అలాంటప్పుడు మీరు వడ్డీతో సహా తిరిగి చెల్లించాలి. అవినీతి పోలీస్ అధికారులకు ఎందుకు రక్షణ కల్పించాలి? వారికి ఎలాంటి రక్షణ కల్పించకూడదు. అలాంటి వారు జైల్లో ఉండాల్సిందే’ అని వ్యాఖ్యానించారు.
ఆగస్ట్ 26న కూడా ఇదే పిటిషన్ విచారణ సందర్భంగా సీజేఐ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, పోలీసు అధికారులు దాని వైపు ఉంటారు. కొత్త పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ అధికారులపై ప్రభుత్వం చర్యలు ప్రారంభిస్తుంది. ఇదొక కొత్త ధోరణి. దీనిని ఆపాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు.