జైపూర్: ఆర్థిక వివాదాల నేపథ్యంలో స్టాంప్ పేపర్లు రాయించుకుని బాలికలను వేలం వేయడం, అమ్మడం వంటి సంఘటనలపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దారుణాలపై స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇలాంటి దురాచారాలను అరికట్టాలని రాజస్థాన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీటిపై మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకుని చర్యలు చేపట్టింది.
ఆడ పిల్లలను బానిసలుగా మార్చే సిరియా, ఇరాక్ల తరహా పరిస్థితులు రాజస్థాన్లో ఉన్నట్లు ఈ నెల 26న మీడియాలో కథనాలు వచ్చాయి. కుల పంచాయితీల పేరుతో ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించాయి. ఇలాంటి నేరాలకు కేంద్రంగా భిల్వాడ ఉందని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇక్కడ ప్రజల్లో ఎవరైన ఇద్దరి మధ్య ఏదైనా ఆర్థిక పరమైన వివాదం తలెత్తితే పోలీసులకు ఫిర్యాదు చేయడం బదులుగా సెటిల్మెంట్ కోసం కుల పంచాయితీలను ఆశ్రయిస్తారు. ఈ క్రమంలో మహిళలు, బాలికలను అమ్మి వారిని బానిసలుగా మారుస్తారు. బాలికలను అమ్మని పక్షంలో వారి తల్లులపై అత్యాచారాలకు ఆదేశిస్తారు.
రూ.15 లక్షల అప్పు చెల్లించేందుకు ఒక వ్యక్తి తొలుత సోదరిని అమ్మాలని కుల పంచాయతీ పెద్దలు బలవంతం చేశారు. మిగతా రూ.8 లక్షల అప్పు కోసం 12 ఏళ్ల కుమార్తెను కూడా బలవంతంగా అమ్మించారు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఐదుగురు కుమార్తెలు కూడా బానిసలుగా మారారు. అయినప్పటికీ అతడి అప్పు తీరలేదు. మరో సంఘటనలో ఒక వ్యక్తితో బలవంతంగా ఇంటిని అమ్మించారు. భార్య వైద్యం కోసం రూ.6 లక్షలు, తల్లి వైద్యం కోసం మరో రూ.6 లక్షలు అప్పు చేశాడు. ఈ అప్పు చెల్లింపు కోసం అతడి చిన్న కుమార్తెను రూ.6 లక్షలకు అమ్ముకున్నాడు. దీంతో ఆమెను ఆగ్రా తీసుకెళ్లి మూడుసార్లు అమ్మేశారు. ఆ బాలిక నాలుగుసార్లు గర్భం దాల్చింది.
ఈ మీడియా కథనాలను చూసి జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) షాక్ అయ్యింది. వీటిని సుమోటోగా స్వీకరించి చర్యలకు ఆదేశించింది. ఆడ పిల్లలను బానిసలుగా మార్చుతూ, వ్యభిచార రొంపిలోకి దించే ఇలాంటి కుల పంచాయితీలపై నివేదిక సమర్పించాలని, వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ సంఘటనలపై దర్యాప్తు జరిపి కేసులు నమోదు చేయాలని డీజీపీ, ఇతర అధికారులకు నోటీసులు జారీ చేసింది.