న్యూఢిల్లీ, అక్టోబర్ 7: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బ విద్యార్థులపై గట్టిగా పడటంతో యూఎస్ వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది గణనీయంగా తగ్గిపోయింది. ఇది కొవిడ్ మహమ్మారి సమయంలో నమోదైన తగ్గుదలను సూచిస్తున్నది. న్యూయార్క్ టైమ్స్ విశ్లేషించిన ట్రేడ్.జీవోవి డాటా ప్రకారం 2025లో ఆగస్టులో అమెరికాకు వచ్చే భారతీయ విద్యార్థుల సంఖ్య గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే 44 శాతం తగ్గింది. భారతీయ విద్యార్థులు అమెరికాలో ఉన్నత చదువులకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమేటిక్స్ (స్టెమ్) కోర్సులు ఎక్కువగా చదువుతుంటారు. అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో అంతా తలకిందులైంది. దీంతో ఈ ఏడాది పరిస్థితి వేరేగా ఉంది. ఏకంగా 44 శాతం మంది విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ఇది మిగిలిన అన్ని దేశాల కన్నా భారీ తగ్గుదలగా పేర్కొంటున్నారు. అయితే మొత్తం మీద అన్ని దేశాల విద్యార్థుల సంఖ్య 19 శాతం తగ్గుదల నమోదు కాగా, భారతీయ విద్యార్ధుల సంఖ్య ఎక్కువగా ఉంది.
భారతీయ విద్యార్థులు తగ్గారా?
అమెరికాకు వెళ్లే విద్యార్ధుల సంఖ్య అనూహ్యంగా తగ్గిపోయిందంటే, విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గిపోయినట్టు మనం భావించ రాదు. ఎందుకంటే మన దేశం నుంచి అమెరికాకు వెళ్లడం తగ్గిందేమో కానీ, విద్యార్థులు దానికి ప్రత్యామ్నాయ దేశాలను ఎంపిక చేసుకుని వెళ్తున్నారు. వారు తమ గమ్యాలను ఇప్పుడు బహుముఖం చేస్తున్నారు. వారు ఇప్పుడు కెనడా, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ, కొన్ని అరబ్ దేశాలను అమెరికాకు ప్రత్యామ్నాయాలుగా ఎంచుకుంటున్నారు. కాగా, భారత్తో పాటు మిగిలిన దేశాల విదేశీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో వాటి దుష్పరిణామాలను అమెరికా యూనివర్సిటీలు ఇప్పటికే స్పష్టంగా ఎదుర్కొంటున్నాయి.