రాయ్పూర్: పెళ్లిళ్లు, రిసెప్షన్లు, పెళ్లి రోజులు, పుట్టిన రోజులు లాంటి శుభకార్యాల సందర్భంగా బంధుమిత్రులు బహుమతులు సమర్పిస్తుంటారు. ఇలా వచ్చే బహుమతులు ఆ బహుమతులు అందుకున్న వారిని మురిపించేలా, సంతోషపెట్టేలా ఉంటాయి. కానీ, అలాంటి ఓ మ్యారేజ్ గిఫ్ట్ (Marriage gift Blast) పెళ్లి కొడుకు ప్రాణం తీసింది. పెళ్లైన మరుసటి రోజే గిఫ్ట్ బాంబులా పేలడంతో పెళ్లి కొడుకు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతని సోదరుడూ మృతిచెందాడు. మరో ఆరుగురు బంధువులు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కబీర్ధామ్ జిల్లాలోని చమరి గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చమరి గ్రామానికి చెందిన యువకుడు హేమేంద్ర మేరవి, అంజానా గ్రామానికి చెందిన యువతికి మధ్య కొన్ని రోజుల క్రితం వివాహం నిశ్చయమైంది. గత శనివారం అంగరంగ వైభవంగా వారి వివాహం జరిగింది. బంధుమిత్రులు రకరకాల కానుకలు సమర్పించారు. వాటిలో ఒక హోమ్ థియేటర్ కూడా ఉంది. పెళ్లి మరుసటి రోజు (ఆదివారం) పెళ్లి కొడుకు తన కుటుంబసభ్యులు, దగ్గరి బంధువులతో కలిసి హోమ్ థియేటర్ను ఆన్ చేశాడు.
దాంతో అది ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో పెళ్లి కొడుకు హేమంద్ర మేరవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతని సోదరుడు రాజ్కుమార్తోపాటు మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పెళ్లికొడుకు సోదరుడు రాజ్కుమార్ కూడా మరణించాడు. మిగతా ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హోమ్ థియేటర్ ప్రమాదవశాత్తు పేలిందా లేదంటే ఇందులో ఏదైనా కుట్ర దాగి ఉందా అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.