ముంబై: మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్కు ముంబై 8వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు మూడవ నాన్ బెయిలబుల్ వారెంట్ను గురువారం జారీ చేసింది. దీంతో ఆయన పరారీలో ఉన్నట్లుగా ప్రకటించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇది జరిగితే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం సింగ్పై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసే ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శేఖర్ జగ్తాప్ తెలిపారు. అలాగే ఆయన ఆస్తుల స్వాధీనానికి వీలు కలుగుతుందన్నారు.
కాగా, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్పై ఆరు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. రెండు కేసులలో ఒకటి థానేలో నమోదు కాగా, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. అలాగే పరమ్ బీర్ సింగ్ దేశం విడిచి పారిపోతారన్న అనుమానంతో థానే కేసులో ఆయనపై లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్వోసీ) కూడా జారీ చేశారు. ఇక గోరేగావ్లో నమోదైన దోపిడీ ఎఫ్ఐఆర్పై దర్యాప్తు చేస్తున్న ముంబై క్రైమ్ బ్రాంచ్, ఎస్ప్లానేడ్ కోర్టు ద్వారా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
మరోవైపు వ్యాపారవేత్త దోపిడీకి సంబంధించి మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్లో నమోదైన మూడవ కేసులో తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. మహారాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) దీనిపై విచారణ జరుపుతున్నది.