High Court | చెన్నై, డిసెంబర్ 19: మహిళల ఆస్తి హక్కుకు సంబంధించి మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భర్త మరణానంతరం మళ్లీ పెండ్లి చేసుకునే భార్యకు హిందూ వివాహ చట్టం ప్రకారం మరణించిన భర్త ఆస్తిలో వాటా పొందే హక్కు ఉంటుందని తీర్పులో పేర్కొంది. కేసు వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని సేలంకు చెందిన సేవి గౌండర్ మరణానంతరం ఆయన వారసులైన చిన్నయ్యన్, ఆయన సోదరులకు ఆస్తులు సంక్రమించాయి.
అయితే చిన్నయ్యన్ మృతి చెందాక ఆయన భార్య మల్లిక రెండో వివాహం చేసుకుంది. తన భర్త ఆస్తుల్లో వాటా ఇవ్వాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్ను సేలం సివిల్ కోర్టు కొట్టివేసింది. దీనిపై ఆమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. భర్తను కోల్పోయిన మహిళకు ఆస్తిలో వాటా లేదని హిందూ వివాహ చట్టం చెప్పలేదని, పునర్వివాహం చేసుకున్న మహిళకు ఆస్తిలో హక్కులేదన్న సెక్షన్ను 2005లోనే రద్దు చేశారని పేర్కొన్న న్యాయమూర్తి జస్టిస్ కుమరప్పన్ ఆమెకు ఆస్తిలో హక్కు ఉందని, ఆమెకు చెందాల్సిన ఆస్తులను అప్పగించాలని తీర్పు చెప్పారు.