శ్రీనగర్, జూన్ 1: హిందూ ఉపాధ్యాయిని రజని బాలా హత్యతో కశ్మీరం మరోసారి నిప్పు కణిక అయ్యింది. లోయలో తమకు భద్రత కల్పించడంలో ప్రధాని మోదీ సర్కారు ఘోరంగా విఫలమయ్యిందని ఆరోపిస్తూ కశ్మీరీ పండిట్లు చేస్తున్న నిరసన ప్రదర్శనలు బుధవారం తారా స్థాయికి చేరాయి. తమను 24 గంటల్లోగా సురక్షిత ప్రాంతాలకు తరలించకుంటే కశ్మీర్ లోయ నుంచి మూకుమ్మడిగా వలస వెళ్లిపోతామన్న పీఎం ప్యాకేజీ పండిట్ ఉద్యోగులు ఆ దిశగా చర్యలను ముమ్మరం చేశారు. ఇండ్లల్లోని వస్తువులు, ఇతరత్రా సామగ్రిని తరలించడానికి ట్రక్కు డ్రైవర్లతో సంప్రదింపులు మొదలుపెట్టారు.
‘బుధవారం సాయంత్రం లోపు ప్రభుత్వం నుంచి మాకు స్పష్టమైన హామీ లభించకపోతే, గురువారం ఉదయం లోయ నుంచి మూకుమ్మడిగా వలసపోతాం’ అని ఓ ఉద్యోగి పేర్కొన్నారు. లోయను విడిచి వెళ్లిపోతామని పండిట్ ఉద్యోగులు హెచ్చరించడంతో ఉద్యోగుల వలసలను అడ్డుకునేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పండిట్లను సమూహాలుగా నిర్ణీత ప్రాంతాలకు పరిమితం చేశారు. గందేర్బాల్ జిల్లాలోని తుల్లాముల్లా, బుద్గాంలోని షేక్పొరా, అనంత్నాగ్లోని వీసు, బారాముల్లా, కుప్వారా జిల్లాల్లో పలు ఆంక్షలు విధించారు. కుల్గాం జిల్లాలో గోపాల్పొరలోని ఓ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్న హిందూ మహిళ రజని బాలాను ఉగ్రవాదులు మంగళవారం తుపాకీతో కాల్చిచంపారు.
హిందూ టీచర్ హత్యను ఖండిస్తూ కశ్మీర్ వ్యాప్తంగా నిరసనలు బుధవారం కూడా కొనసాగాయి, జమ్ము, సాంబా, కథువా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు మిన్నంటాయి. మృతురాలు బాలాను సురక్షిత ప్రాంతానికి బదిలీ చేయకుండా ఆమె హత్యకు కారణమైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సాంబాలోని జమ్ము-పఠాన్కోట్ హైవేను నిరసనకారులు దిగ్బంధించారు. బీజేపీ సర్కారు, పాకిస్థాన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
24 గంటల్లోగా తమను సురక్షిత ప్రాంతాలకు బదిలీ చేయకపోతే లోయ నుంచి మూకుమ్మడిగా వలసపోతామన్న పండిట్ల అల్టీమేటంపై జమ్ముకశ్మీర్ యంత్రాంగం దిగొచ్చినట్టు సమాచారం. కశ్మీర్ డివిజన్లో విధులు నిర్వహిస్తున్న పీఎం ప్రత్యేక ప్యాకేజీ పండిట్ ఉద్యోగులు, ఇతర మైనారిటీ ఉద్యోగులను జూన్ 6లోపు లోయలోని సురక్షిత ప్రాంతాలకు బదిలీ చేసేందుకు బుధవారం యంత్రాంగం నిర్ణయించిందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నేతృత్వంలో బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించినట్టు పేర్కొన్నాయి. పండిట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ (జీఏడీ) ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ను, ఈ-మెయిల్ ఐడీని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.
కశ్మీరీ పండిట్లకు భద్రత కల్పించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. పండిట్ల గళాన్ని నొక్కేయవద్దన్నారు. ఈ ఏడాది 16 మంది పండిట్లు హత్యకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ కశ్మీరీ పండిట్లు ఒకవైపు నిరసనలు తెలియజేస్తుంటే, మోదీ సర్కారు ఎనిమిదేండ్ల ఉత్సవాల్లో మునిగిపోయిందని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ మండిపడ్డారు.
హిందూ టీచర్ బాలా హత్య నేపథ్యంలో తమ ప్రాణాలు ఎక్కడ పోతాయేమోనన్న భయంతో మంగళవారం రాత్రికి రాత్రి 100కు పైగా హిందూ కుటుంబాలు కుల్గాంను విడిచిపెట్టి వెళ్లిపోయారని బారాముల్లాలోని హిందూ కశ్మీరీ పండిట్ కాలనీ ప్రెసిడెంట్ అవతార్ క్రిష్ణణ్ భట్ తెలిపారు. భద్రతపై ప్రభుత్వం హామీ ఇవ్వకపోతే గురువారం ఉదయం కుటుంబంతో సహా తాను కూడా కశ్మీర్ను విడిచిపెట్టి వెళ్లనున్నట్టు పేర్కొన్నారు. కశ్మీర్లో హిందువులను చంపడంపై న్యాయవాది వినీత్ జిందాల్ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణతో పాటు సుప్రీంకోర్టు జడ్జిలకు ఓ లేఖ రాశారు. లోయలో హిందువులు, పండిట్ల హత్యలు ఆ వర్గ ప్రజల్లో తీవ్ర భయాందోళనలను కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. కశ్మీర్లో మైనారిటీల భద్రతకు కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు జూన్ 5-7 మధ్య జమ్ములో జరుగనున్న ‘మాతా ఖీర్ భవానీ మేళా’కు హిందువులు ముఖ్యంగా కశ్మీరీ పండిట్లు ఎవరూ హాజరుకావొద్దని మాతా ఖీర్ భవానీ ఆస్తాపన్ ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది.