ముంబై: మహారాష్ట్రకు చెందిన శ్రద్ధాను ఢిల్లీలో సహజీవనం చేస్తున్న ప్రియుడు ఆఫ్తాబ్ దారుణంగా హత్య చేసి ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికిన ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హిందూ, ముస్లిం జంట వివాహ రిసెప్షన్ రద్దైంది. హతురాలు శ్రద్ధా, హంతకుడు ఆఫ్తాబ్ సొంత ఊరైన వసాయ్లో ఈ సంఘటన జరిగింది. హిందూ, ముస్లిం జంట పెళ్లి రిసెప్షన్ స్థానిక ఫంక్షన్ హాల్లో ఆదివారం జరుగనున్నది. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రిక ఫొటోను సుదర్శన్ న్యూస్ ఎడిటర్ సురేష్ చవాన్కే శుక్రవారం ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘హంతకుడు ఆఫ్తాబ్కు చెందిన వసాయ్లో ఇప్పుడు ఇమ్రాన్, దివ్యల వివాహం జరుగుతోంది. శ్రద్ధాను హత్య చేసి ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికి చంపిన హృదయ విదారక నేరం తర్వాత ఇది ఎలా జరుగుతుంది’ అని ప్రశ్నించారు. ‘లవ్ జిహాద్, యాక్ట్ ఆఫ్ టెర్రరిజం’ అన్న హ్యాష్ట్యాగ్లతో ట్వీట్ చేశారు.
కాగా, ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో వసాయ్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు రిసెప్షన్ ఫంక్షన్ను నిలిపివేయాలని స్థానిక హిందూ, ముస్లిం సంస్థలు ఫంక్షన్ హాల్ యజమానికి చెప్పారు. ఈ నేపథ్యంలో హిందూ, ముస్లిం జంటకు చెందిన ఇరు కుటుంబాలు శనివారం స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఆదివారం తలపెట్టిన మ్యారేజ్ రిసెప్షన్ను రద్దు చేసినట్లు వెల్లడించారు.