బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో మతసామరస్యానికి మచ్చుతునక లాంటి ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. విజయపుర జిల్లాలోని అల్మేల్ పట్టణానికి చెందిన ముస్లిం వ్యక్తి మహబూబ్ మస్లీ గత పదేండ్లుగా ఒక హిందూ అనాథ బాలికను పెంచి పెద్దచేసి.. తాజాగా ఆమెకు ఈడూజోడూ అయిన హిందూ వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
వివరాల్లోకి వెళ్తే.. పదేండ్ల క్రితం మహబూబ్ మస్లీ ఉండే అల్మేల్ పట్టణంలోనే ఓ హిందూ కుటుంబం కూడా ఉండేది. ఆ కుటుంబంలో దంపతులిద్దరూ తమ ఎనిమిదేండ్ల కూతురు పూజతో కలిసి నివసించేవారు. అయితే, అనారోగ్య కారణాల వల్ల పూజ తల్లితండ్రి ఇద్దరూ కొన్ని రోజుల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు. దాంతో పూజ అనాథగా మిగిలిపోయింది. పూజ బంధువుల్లో ఎవరు కూడా ఆమెను చేరదీసేందుకు ముందుకు రాలేదు.
దాంతో కాంట్రాక్టర్ అయిన ముస్లిం వ్యక్తి మహబూబ్ మస్లీ ఆ చిన్నారిని చేరదీశాడు. అప్పటికే ఆయనకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. అయినా పూజను కూడా తన ఇంట్లో పెట్టుకుని బిడ్డలా పోషించాడు. తన పిల్లలతోపాటే చదువు చెప్పించాడు. ఇప్పుడు ఆమెకు 18 ఏండ్లు నిండటంతో.. హిందూ సామాజిక వర్గానికి చెందిన 21 ఏండ్ల శంకర్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించాడు. పూర్తిగా హిందూ సంప్రదాయం ప్రకారం పెండ్లి చేశాడు.
గత పదేండ్లుగా పూజకు అన్నీ తానై చూసుకున్నానని, కానీ ఏనాడు ఆమెను తమ మత సాంప్రదాయాలు పాటించాలని ఒత్తిడి చేయలేదని మహబూబ్ మస్లీ చెప్పాడు. హిందూ అమ్మాయికి ఆమె మతానికి సంబంధించిన వ్యక్తిని ఇచ్చి పెండ్లి చేయడమే న్యాయమని, అందుకే హిందూ అబ్బాయిని చూసి పెండ్లి చేశానని తెలిపాడు. పదేండ్లు పెంచి పెద్దచేసిన తండ్రిగా తన కుమార్తె వివాహం జరిపించడం తన బాధ్యత అని మస్లీ వ్యాఖ్యానించాడు.
తనను తన పెంపుడు తల్లిదండ్రులు ఎంతో బాగా చూసుకున్నారని పెండ్లి కూతురు పూజ చెప్పింది. వారు తనపై చూపిన ప్రేమ, ఆప్యాయతలను తాను మాటల్లో వర్ణించలేనని తెలిపింది. వాళ్లు నన్ను సొంత కూతురులా పెంచి పెండ్లి జరిపించడం చాలా సంతోషంగా ఉందన్నారు.