ముంబై: ఒక వ్యక్తి మూడు నెలల కిందట మరణించాడు. అయితే తండ్రిని తన తల్లే హత్య చేసినట్లు కుమార్తె గుర్తించింది. తల్లి మొబైల్ ఫోన్ ద్వారా ఈ విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ మహిళను అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అయిన భర్తను ఆయన భార్య రంజన ఆగస్ట్ 6న హత్య చేసింది. నిద్రపోతున్న ఆయన ముఖంపై దిండి నొక్కిపెట్టి ఊపిరాడకుండా చేసి చంపింది. అనంతరం తన ప్రియుడికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పింది. రాత్రి వేళ గుండెపోటుతో చనిపోయినట్లు ఉదయం బంధవులందరికీ చెబుతానని అన్నది. మరునాడు ఆ విధంగానే అందరిని నమ్మించింది. దీంతో రంజన భర్త మరణంపై ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదు. ఆయన మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
కాగా, తండ్రి మరణించిన మూడు నెలల తర్వాత కుమార్తె శ్వేత ఇంటికి తిరిగి వచ్చింది. ఫోన్ కాల్ చేసేందుకు తల్లి రంజనను అడిగి ఆమె మొబైల్ ఫోన్ తీసుకుంది. ఈ సందర్భంగా తండ్రి హత్యపై, ప్రియుడు ముఖేష్ త్రివేదితో తల్లి మాట్లాడిన ఆడియో రికార్డింగ్ను గుర్తించింది. ఆ వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి దీనిపై ఫిర్యాదు చేసింది. దీంతో రంజన, ఆమె ప్రియుడు ముఖేష్ను పోలీస్ స్టేషన్కు పోలీసులు పిలిపించారు. ఆ ఆడియో క్లిప్ను వినిపించి అడగ్గా నేరాన్ని ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలో భర్తను హత్య చేసిన భార్య రంజనను పోలీసులు అరెస్ట్ చేశారు. కుమార్తె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.