Manipur violence | ఇంఫాల్, జనవరి 11: మణిపూర్ రోడ్లపై ముడిచమురు పెద్ద ఎత్తున ప్రవహించింది. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని విద్యుత్తు కేంద్రం నుంచి ముడిచమురు పెద్ద ఎత్తున లీక్ అయింది. లీమాఖోంగ్ పవర్స్టేషన్ నుంచి బుధవారం రాత్రి ఈ లీక్ మొదలైంది. గురువారం కాంటోసబల్, సెక్మాయివంటి గ్రామాల మీదుగా చమురు ఎగజిమ్ముతూ ఏరులై పారింది. ఈ ప్రవాహాలు ఇంఫాల్ నదిలోకి కలిశాయి. పెద్ద ఎత్తున ముడిచమురు లీక్ కావడంతో సీఎంవో కార్యాలయం స్పందించింది. తక్షణ నివారణ చర్యలు తీసుకోవాలని, తాగునీటి, ఇతర వనరులు దెబ్బతినకుండా నివారణ చర్యలు తీసుకోవాలని యంత్రాంగాన్ని ఆదేశించింది. యంత్రాలను, సిబ్బంది వినియోగించి లీక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఈ లీక్ ఘటనలో ఎవరైనా అగంతకుల ప్రమేయం ఉన్నదా? లేదా ప్రమాదశాత్తు జరిగిందా? అనే కోణంలోనూ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ముడిచమురు కారణంగా పలు చోట్ల మంటలు రేగాయి. ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
మణిపూర్లో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మిలిటెంట్లుగా అనుమానిస్తున్న కొందరు నలుగురు గ్రామస్తులను అపహరించి హతమార్చిన ఘటన చురచందాపూర్, బిష్ణుపూర్ జిల్లాల మధ్య చోటుచేసుకుంది. మృతులలో తండ్రీ, కొడుకుతో పాటు మరో ఇద్దరు ఉన్నారు. ఇంఫాల్కు 45 కిలోమీటర్ల దూరంలోని బిష్ణుపూర్లోని అకసాయ్ గ్రామానికి చెందిన నలుగురు వంట చెరకు కోసం సమీపంలోని అడవికి వెళ్లారు. అయితే వారిని మిలిటెంట్లుగా భావిస్తున్న కొందరు అడ్డగించి అపహరించారు. తర్వాత వారిని చిత్రహింసలు పెట్టి హతమార్చినట్టు బాధిత కుటుంబాల సభ్యులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, హంతకుల కోసం భద్రతా దళాలు గాలిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. కాగా కొండ ప్రాంత జిల్లాగా ఉన్న చురచందాపూర్లో కుకీల ప్రాబల్యం అధికంగా ఉండగా, అక్కడికి 35 కిలోమీటర్ల దూరంలోని బిష్ణుపూర్ జిల్లాలో మైతీల ఆధిపత్యం ఉండటంతో ఈ ప్రాంతాల్లో తరచూ గొడవలు జరుగుతుంటాయి.