లక్నో: పాము కాటు వేయడంతో అన్న మరణించాడు. అయితే అంత్యక్రియల కోసం అన్న ఊరికి వెళ్లిన తమ్ముడ్ని కూడా పాము కాటు వేయడంతో చనిపోయాడు. ఉత్తర ప్రదేశ్లోని బలరాంపూర్ జిల్లాలో ఈ విషాద సంఘటన జరిగింది. భవానీపూర్ గ్రామానికి చెందిన 38 ఏళ్ల అరవింద్ మిశ్రాను మంగళవారం పాము కరిచింది. దీంతో అతడు మరణించాడు. పంజాబ్లోని లూధియానాలో ఉంటున్న 22 ఏళ్ల తమ్ముడు గోవింద్ మిశ్రా తన అన్న మరణ వార్త తెలుసుకున్నాడు. బంధువుతో కలిసి ఆ గ్రామానికి బుధవారం వచ్చాడు. అన్న అంత్యక్రియల్లో పాల్గొన్నాడు.
కాగా, ఆ రాత్రికి గదిలో నిద్రపోతున్న గోవింద్ మిశ్రా, అతడి బంధువు చంద్రశేఖర్ పాండేను పాము కరిచింది. దీంతో గోవింద్ మిశ్రా కూడా చనిపోయాడు. చంద్రశేఖర్ పాండేను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి కూడా సీరియస్గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
అయితే పాము కాటు వల్ల అన్నాదమ్ములు మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొన్నది. స్థానిక ఎమ్మెల్యే కైలాష్ నాథ్ శుక్లా ఆ కుటుంబాన్ని పరామర్శించారు. తగిన సహాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఇలాంటి దుర్ఘటనలు నివారించేలా చర్యలు చేపట్టాలని స్థానిక అధికారులను ఆదేశించారు.