Islamabad | భారత ఆర్థిక వ్యవస్థతో పోల్చితే పాక్ ఆర్థిక వ్యవస్థ అత్యంత పటిష్ఠంగా ఉందని కొన్ని రోజుల కిందటే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బీరాలు పలికిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. బ్రిటన్ ప్రధాని కూడా తాను చెప్పినట్లే నడుచుకుంటున్నారని కూడా ఇమ్రాన్ గొప్పలకు పోయారు. అయితే.. పాక్ ఆర్థిక దుస్థితి, ప్రజల అవస్థలను చూసి పాక్ ప్రధాని ఇమ్రాన్కు నిద్ర కూడా పట్టడం లేదట. పాక్ ప్రజలు పడుతున్న ఇబ్బందిని చూసి ఇమ్రాన్కు ఏం చేయాలో కూడా పాలు పోవడం లేదట. ఈ విషయాన్ని డాన్ పత్రిక ఓ రిపోర్టులో వెల్లడించింది. అంతేకాకుండా పాక్ తీవ్రమైన ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోందని మొట్ట మొదటి సారిగా ప్రధాని ఇమ్రాన్ ఒప్పేసుకున్నారు. ఒప్పుకోవడం కాదు.. తీవ్ర నిస్సహాయతను కూడా వ్యక్తం చేసేశారు. అయితే ఇదంతా కరోనా వల్లే జరుగుతోందంటూ పేర్కొంటున్నారు.
ప్రధాని ఇమ్రాన్ శనివారం సోషల్ మీడియాలో సాధారణ ప్రజానీకంతో సంభాషించారు. ఈ సందర్భంగా అందులోంచి ఒకరు పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణం గురించి ఇమ్రాన్ను ప్రశ్నించారు. దీనికి ఇమ్రాన్ సమాధానంగా ద్రవ్యోల్బణం ఒక్కటే సమస్య. ఈ సమస్యతో నాకు నిద్ర కూడా పట్టడం లేదు. అయితే ద్రవ్యోల్బణం అనేది ప్రపంచ సమస్య అంటూ ఇమ్రాన్ తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే మరో ప్రశ్న కూడా వేశారు. కరోనా సమయంలో అమెరికా ప్రజల కోసం 6 వేల బిలియన్లు ఖర్చు చేసిందా? అని అడగ్గా.. పాకిస్తాన్ 8 వేల బిలియన్ డాలర్లను ఖర్చు చేసిందని పేర్కొన్నారు.
కరోనా లాంటి క్లిష్ట సమయంలో పాక్ ఆర్థిక వ్యవస్థ బాగానే వుందని, భారత్ ఆర్థిక వ్యవస్థ కంటే మెరుగ్గానే వుందని పాక్ ప్రధాని ఇమ్రాన్ పేర్కొన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో కొన్ని రోజుల కిందట జరిగిన సదస్సులో పాక్ ప్రధాని ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలివి. కరోనాను భారత్ కంటే గొప్పగానే ఎదుర్కొన్నామని, ఆ సమయంలో భారత్ వృద్ధి రేటు కిందికి పడిపోతే, పాక్ ఆర్థిక వ్యవస్థ మాత్రం అలాగే పటిష్ఠంగా ఉందంటూ పేర్కొన్నారు.