చండీగఢ్: అల్లరి మూక దాడి (Haryana Violence) నుంచి ఒక మహిళా జడ్జి తృటిలో తప్పించుకున్నారు. మూడేళ్ల కుమార్తెతో కలిసి కారు దిగి ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఒక వర్క్ షాప్లో దాక్కున్నారు. ఆ తర్వాత కొందరు న్యాయవాదులు ఆమెను అక్కడి నుంచి రక్షించారు. అయితే రోడ్డుపై వదిలేసిన మహిళా న్యాయమూర్తి కారుకు ఆందోళనకారులు నిప్పుపెట్టడంతో అది పూర్తిగా కాలిపోయింది. హర్యానాలోని నూహ్లో ఈ సంఘటన జరిగింది. నూహ్ కోర్టులో అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ఏసీజేఎం)గా ఉన్న అంజలి జైన్ సోమవారం మధ్యాహ్నం 1 గంటకు మాడేళ్ల కుమార్తె, గన్మ్యాన్తో కలిసి కారులో ఎస్కేఎం మెడికల్ కాలేజీకి వెళ్లారు. అక్కడ మందులు కొనుగోలు చేసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కారులో తిరిగి వెళ్తున్నారు.
కాగా, పాత బస్టాండ్ వద్ద సుమారు 150 మంది ఉన్న అల్లరి మూకలు జడ్జి ప్రయాణిస్తున్న కారుపై దాడి చేశారు. రాళ్లు రువ్వగా కారు వెనుక ఉన్న అద్దాలు పగిలాయి. ఆ ప్రాంతంలో కొందరు కాల్పులు కూడా జరిపారు. దీంతో న్యాయమూర్తి అంజలి జైన్, మూడేళ్ల కుమార్తెను తీసుకుని డ్రైవర్, గన్మ్యాన్ సహాయంతో కారు దిగారు. ప్రాణాలు దక్కించుకునేందుకు రోడ్డుపై పరుగులు తీశారు. పాత బస్టాండ్ వద్ద ఉన్న వర్క్షాప్లో వారంతా దాక్కున్నారు. ఆ తర్వాత కొంత మంది న్యాయవాదులు అక్కడకు చేరుకుని ఆ మహిళా జడ్జి, ఆమె కుమార్తెను రక్షించారు.
మరోవైపు న్యాయమూర్తి అంజలి జైన్ ప్రాణ భయంతో రోడ్డుపై వదిలేసిన కారుకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. మంటల్లో అది కాలిపోయింది. మరునాడు తన కారు కోసం వచ్చిన మహిళా జడ్జి అది పూర్తిగా కాలిపోవడం చూసి షాకయ్యారు. ఈ నేపథ్యంలో కోర్టు సిబ్బంది ఆమె తరుఫున పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం నూహ్లో జరిగిన హింసాకాండలో ఇద్దరు పోలీసులతో సహా ఆరుగురు మరణించారు.