చండీఘడ్: హర్యానా సీఎం నాయాబ్ సింగ్ సైనీ(Nayab Singh Saini).. రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో నెగ్గారు. మూజువాణీ ఓటు ద్వారా విశ్వాస తీర్మానాన్ని ఆమోదించారు. మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామాతో.. అనూహ్య రీతిలో సైనీ సీఎం బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీలో ఆయన బలపరీక్ష ఎదుర్కొన్నారు. జేజేపీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఇవాళ అసెంబ్లీ పరిసరాల్లో కనిపించారు. పార్టీ ఇచ్చిన విప్ను ఉల్లంఘించి కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీ చేరుకున్నారు. అయితే విశ్వాస పరీక్ష మొదలైన తర్వాత ఆ ఎమ్మెల్యేలు హౌజ్ నుంచి వెళ్లిపోయారు. ప్రతిపక్ష నేత భూపిందర్ హూడా, కాంగ్రెస్ ఎమ్మెల్యే బీబీ బద్రాలు సభను గంట పాటు వాయిదా వేయాలని కోరారు. రాష్ట్రంలో అస్థిరత్వం ఉందని, రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే రఘువీర్ కడియన్ తెలిపారు. విశ్వాస పరీక్షపై సీక్రెట్ బ్యాలెట్ కావాలని ఆయన డిమాండ్ చేశారు.